Vizag Film Club: చేజారిన వైజాగ్ ఫిలిం క్లబ్‌.. వైసీపీ నేతలు పరేషాన్

ప్రతిష్టాత్మక హైదరాబాద్ ఫిలిం నగర్ క్లబ్‌కు అనుబంధంగా సినీ ప్రముఖులు విశాఖలో ఏర్పాటు చేసిన వైజాగ్ ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ (ఫిలిం క్లబ్) వైసీపీ రాజ్యసభ సభ్యుడు పి.విజయసాయి రెడ్డి కంబంధ హస్తాల్లో నుంచి బయటపడనుంది.

Update: 2024-07-05 03:26 GMT

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: ప్రతిష్టాత్మక హైదరాబాద్ ఫిలిం నగర్ క్లబ్‌కు అనుబంధంగా సినీ ప్రముఖులు విశాఖలో ఏర్పాటు చేసిన వైజాగ్ ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ (ఫిలిం క్లబ్) వైసీపీ రాజ్యసభ సభ్యుడు పి.విజయసాయి రెడ్డి కంబంధ హస్తాల్లో నుంచి బయటపడనుంది. రాష్ర్టంలో కూటమి ప్రభుత్వం తిరుగులేని మెజారిటీతో విజయం సాధించడంతో విజయ సాయి బృందానికి వ్యతిరేకంగా క్లబ్ సభ్యుల్లో తిరుగుబాట ప్రారంభమైంది.

దీంతో గత ఐదేళ్లుగా నిబంధనలకు విరుద్ధంగా తన మనుషులను క్లబ్‌లోకి ప్రవేశపెట్టి, సినీ ప్రముఖులను దూరం చేసి, పాలక వర్గాన్ని తమ చెప్పుచేతల్లోకి తీసుకున్న విజయ సాయిరెడ్డి ఆగడాలకు చెక్ పడింది. సినీ రంగంతో సంబంధాలు వున్న భీమిలి నియోజక వర్గ శాసనసభ్యుడు గంటా శ్రీనివాస్ రావును ఇటీవల క్లబ్ వ్యవస్థాపకుడు కేఎస్ రామారావు తదితరులు కలసి క్లబ్‌ను విముక్తి చేయాల్సిందిగా కోరడంతో ఆయన క్లబ్‌ను సందర్శించి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. క్లబ్ పాలక వర్గం నుంచి స్వచ్చందంగా తప్పుకోవాల్సిందిగా గంటా ఆ రోజు హెచ్చరించారు. అది పనిచేయడం ప్రారంభించింది.

సినీ ప్రముఖులు పక్కకు.. వీరు ముందుకు ..

రాష్ర్టంలో వైసీపీ ప్రభుత్వం రాకముందు సినీ నిర్మాతలు కేఎస్ రామారావు, సి.కళ్యాణ్ తదితరులు విశాఖ ఫిలిం క్లబ్‌కు అంకురార్పణ చేసి కార్యకలాపాలు ప్రారంభించారు. కేఎస్ రామారావు అధ్యక్షుడిగా తిమ్మాపురం బీచ్ రోడ్‌లోని అద్దె భవనంలో క్లబ్ ప్రారంభమై సభ్యత్వాన్ని పెంచుకొంది. వైసీపీ ఉత్తరాంధ్రా ఇన్చార్జిగా విశాఖలో తిష్టవేసిన విజయసాయిరెడ్డి క్లబ్ ఎదురుగా ఉన్న ఉమేష్ గెస్ట్ హౌస్ కేంద్రంగా కొంత కాలం కార్యకలాపాలు నడిపారు.

అప్పుడు క్లబ్‌పై దృష్టి సారించిన ఆయన సినీ ప్రముఖులను తప్పించి తన సొంత మనుషులకు క్లబ్ సభ్యత్వాలు ఇప్పించి కార్యవర్గ సభ్యులుగా వారినే నియమింపజేశారు. రాష్ర్ట మైరైన్ కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేసిన వైసీపీ నేత కాయల వెంకటరెడ్డిని అధ్యక్షుడిగా, తనతో వుండే సిహెచ్ శ్రీనివాసరాజును కార్యదర్శిగా, తన బినామీగా గుర్తింపు పొందిన ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్ఆర్ గోపీనాధ రెడ్డిని కోశాధికారిగా ఎంపిక చేయించారు.

అంతటితో ఆగక క్లబ్‌కు శాశ్వత కోర్ కమిటీని నియమింపజేసి వైసీపీ నేత సాగి దుర్గా ప్రసాదరాజు‌ను చైర్మన్‌గా చేసి, కార్యవర్గంలో వున్న పై ముగ్గురితో పాటు తన కుడిభుజంగా చెలామణి అయిన ఏ యూ మాజీ వీసీ పీవీజీడీ ప్రసాదరెడ్డి, టి. శ్రీనివాసరెడ్డి, బి. రాజశేఖర రెడ్డి, వి. శ్రీనివాస రెడ్డి తదితరులును కమిటీలో వేశారు.

కోర్ కమిటీ రద్దు చేస్తామని బేరం ..

సాగి దుర్గాప్రసాదరాజు అధ్యక్షుడిగా ఏర్పాటైన శాశ్వత కోర్ కమిటీకి క్లబ్ బైలా ప్రకారం విలువ లేనందున దానిని రద్దు చేయాలని మొదటినుంచి సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అయితే, రాష్ర్టంలో కూటమి అధికారంలోకి రావడంతో కాయల వెంకట రెడ్డి నేతృత్వంలోని పాలకవర్గం కోర్ కమిటీని రద్దు చేసేందుకు ముందుకొచ్చింది.

అయితే, కార్యవర్గం కూడా తప్పుకోవాలంటూ మెజారిటీ సభ్యులు డిమాండ్ చేస్తుండడం, గంటా శ్రీనివాసరావు కూడా అదే విషయాన్ని స్పష్టం చేయడంతో తప్పుకోక తప్పడం లేదు. దీంతో త్వరలో వార్షిక సర్వ సభ్య సమావేశం ఏర్పాటు చేసి అందులోనే రాజీనామాలను సమర్పించాలని నిర్ణయించారని తెలిసింది.

సాగి, ఎంఎస్ఎన్ రాజులతోనే తంటా..

మిగిలిన వారంతా తప్పుకోవడానికి సిద్ధమైన క్లబ్‌లో నిధుల దుర్వినియోగానికి, సభ్యుల మధ్య గొడవలకు కారణమైన కార్యవర్గ సభ్యుడు ఎంఎస్ఎన్ రాజు తప్పుకోవడానికి ఇష్టపడడం లేదని తెలిసింది. క్లబ్ కోర్ కమిటీని, కార్యవర్గాన్ని మేనేజ్ చేసి క్లబ్‌కు తానే రాజు, మంత్రి అన్నట్టుగా ఎంఎస్‌ఎన్ రాజు వ్యవహరించారు. అద్దె ప్రాంగణంలో వున్న క్లబ్ వ్యవహారాల్లో వేలు పెట్టి కోటిన్నర రూపాయలతో అవసరం లేని నిర్మాణాలు, అలంకరణలు చేశారని సభ్యులు మండిపడుతున్నారు.

క్లబ్‌ను ఇంతకాలం నడిపిన ఉద్యోగులను తొలగించి కొత్తవారిని తీసుకొచ్చి వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక కోర్ కమిటీ అధ్యక్షుడు సాగి దుర్గా ప్రసాదరాజు తనకు గంటా బాగా పరిచయమని, ఆయనను ఒప్పించి కొనసాగేందుకు పట్టుపడుతున్నారని తెలిసింది.


Similar News