Waqf Bill: రేపు లోక్సభ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు!
వక్ఫ్ సవరణ బిల్లును సమీక్షించడానికి ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) నివేదికను గురువారం లోక్ సభలో ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది.

దిశ, నేషనల్ బ్యూరో: వక్ఫ్ సవరణ బిల్లును సమీక్షించడానికి ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (jpc) నివేదికను గురువారం లోక్ సభలో ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే 15-11 మెజారిటీతో జేపీసీ ఆమోదించిన ఈ బిల్లు నివేదికను లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు (Om Birla) అందజేశారు. ఈ బిల్లుపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశాయి. కాబట్టి నివేదికను పార్లమెంటులో ప్రవేశపెట్టే సందర్భంగా భారీ గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది. ఎన్డీఏ కూటమి సభ్యులు సూచించిన కొన్ని మార్పులు అమలులోకి వచ్చినట్టు సమాచారం. అలాగే వక్ఫ్ సవరణ బిల్లుపై జేపీసీ ఎదుట సమర్పించిన సాక్ష్యాల రికార్డును కూడా ప్రవేశపెట్టనున్నారు. కాగా, వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావడానికి ఉద్దేశించిన వక్ఫ్ సవరణ బిల్లును గతేడాది ఆగస్టు 9న సభలో ప్రవేశపెట్టారు. అయితే దీనిపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో బిల్లులో సవరణలు చేసేందుకు గాను జేపీసీని ఏర్పాటు చేశారు.