చాందిపుర వైరస్‌తో మరో ఇద్దరు పిల్లలు మృతి..గుజరాత్‌లో ఆందోళన

గుజరాత్‌లో చాందిపుర వైరస్ కలకలం రేపుతోంది. ఈ వైరస్ బారిన పడి తాజాగా మరో ఇద్దరు చిన్నారులు మరణించినట్టు ఆరోగ్య మంత్రి రుషికేశ్ పటేల్ తెలిపారు. దీంతో ఇప్పటి వరకు వైరస్ సోకిన వారి సంఖ్య 14కు పెరగగా..

Update: 2024-07-16 16:29 GMT

దిశ, నేషనల్ బ్యూరో: గుజరాత్‌లో చాందిపుర వైరస్ కలకలం రేపుతోంది. ఈ వైరస్ బారిన పడి తాజాగా మరో ఇద్దరు చిన్నారులు మరణించినట్టు ఆరోగ్య మంత్రి రుషికేశ్ పటేల్ తెలిపారు. దీంతో ఇప్పటి వరకు వైరస్ సోకిన వారి సంఖ్య 14కు పెరగగా..అందులో 8 మంది మరణించినట్టు తెలిపారు. గాంధీనగర్‌లో మంగళవారం మీడియాతో మాట్లాడిన రుషికేశ్ ఈ వివరాలను వెల్లడించారు. సబర్‌కాంత, ఆరావళి, మహిసాగర్, ఖేడా, మెహసానా, రాజ్‌కోట్ జిల్లాల్లో కేసులు నమోదయ్యాయని తెలిపారు. ప్రభావిత జిల్లాలపై నిఘా పెట్టామని, కొన్ని లక్షణాలతో అనుమానిత కేసులను చాందిపురా వైరస్ కేసులుగా పరిగణించేందుకు కమ్యూనిటీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప-జిల్లా ఆస్పత్రులతో పాటు మెడికల్ కాలేజీలకు ప్రత్యేక సలహా జారీ చేశామని చెప్పారు.

ఈ వ్యాధి సోకిన వారి మరణాల రేటు ఎక్కువగా ఉందని, వైద్యం అందడంలో జాప్యం జరిగితే రోగి బతకడం కష్టమన్నారు. ముందు జాగ్రత్త చర్యగా 26 మండలాల్లోని 44,000 మందికి పైగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. పరిస్థితి విషమించి ఇప్పటివరకు ఆస్పత్రుల్లో మరణించిన వారిలో సబర్‌కాంత జిల్లాకు చెందిన ఇద్దరు, ఆరావళికి చెందిన ముగ్గురు, మహిసాగర్, రాజ్‌కోట్ జిల్లాలకు చెందిన ఒక్కొక్కరు, రాజస్థాన్‌కు చెందిన ఒకరు ఉన్నారని తెలిపారు. అలాగే పలు రోగుల రక్త నమూనాలను పూణేకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపామని వాటి ఫలితాలు రావాల్సి ఉందని చెప్పారు. 

Similar News