Punjab: సరిహద్దుల్లో డ్రగ్స్ స్మగ్లింగ్.. ముగ్గురు నిందితుల అరెస్ట్
సరిహద్దుల్లో డ్రగ్స్ రవాణా చేసేందుకు డ్రోన్లను ఉపయోగించే ట్రాన్స్బోర్డర్ నార్కోటిక్ స్మగ్లింగ్ నెట్వర్క్లను పోలీసులు చేధించారు.
దిశ, నేషనల్ బ్యూరో: సరిహద్దుల్లో డ్రగ్స్ రవాణా చేసేందుకు డ్రోన్లను ఉపయోగించే ట్రాన్స్బోర్డర్ నార్కోటిక్ స్మగ్లింగ్ నెట్వర్క్లను పంజాబ్ పోలీసులు చేధించారు. ఈ క్రమంలోనే ముగ్గురు డ్రగ్స్ స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 5 కిలోల హెరాయిన్, రూ. 3.95 లక్షల డబ్బును స్వాధీనం చేసుకున్నట్టు పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ తెలిపారు. అరెస్టైన వారిని అమృత్సర్లోని రోరన్వాలి గ్రామానికి చెందిన గురుప్రీత్ సింగ్, రోరన్వాలి గ్రామానికి చెందిన హర్ప్రీత్ సింగ్ అలియాస్ హ్యాపీ, అజ్నాలాలోని చార్తేవాలి గ్రామానికి చెందిన జోతా సింగ్గా గుర్తించారు. నిందితులు జోతా సింగ్, హర్ప్రీత్ సింగ్లు సరిహద్దుల గుండా డ్రగ్స్ రవాణా చేయడానికి డ్రోన్లను ఉపయోగిస్తున్న పాకిస్తాన్కు చెందిన డ్రగ్ స్మగ్లర్లతో నేరుగా టచ్లో ఉన్నారని తెలిపారు. పక్కా సమాచారం అందుకున్న పోలీస్ బృందాలు అజ్నాలాలో ఉన్న న్యూ అజ్నాలా కాలనీలోని ఒక ఇంటి నుంచి నిందితులను పట్టుకున్నట్టు చెప్పారు. పాక్కు చెందిన డ్రగ్స్ స్మగ్లర్ను గుర్తించేందుకు విచారణ కొనసాగుతోందని, అరెస్టైన వ్యక్తులు ఎవరికి డ్రగ్స్ను సరఫరా చేశారనే దానిపై ఆరా తీస్తున్నట్టు వెల్లడించారు.