నీట్ పేపర్ లీక్‌పై స్పందించిన NTA చీఫ్

నీట్ పేపర్ లీక్ అయిందని పరీక్షలో అవకతవకలు జరిగాయని గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే

Update: 2024-06-08 11:51 GMT

దిశ, నేషనల్ బ్యూరో: నీట్ పేపర్ లీక్ అయిందని పరీక్షలో అవకతవకలు జరిగాయని గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని ఇప్పటికే కొంతమంది సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేశారు. ఇదిలా ఉంటే, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ దీనిపై స్పందించారు. శనివారం మాట్లాడిన ఆయన నీట్ పేపర్ లీక్ అయిందని వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని, పేపర్ లీక్ జరగలేదని, మొత్తం పరీక్ష ప్రక్రియ చాలా పారదర్శకంగా జరిగిందని స్పష్టం చేశారు. అలాగే, ఈ పరీక్షలో 1,500 మందికి పైగా అభ్యర్థులకు లభించిన గ్రేస్ మార్కులను సమీక్షించేందుకు విద్యా మంత్రిత్వ శాఖ నలుగురు సభ్యుల ప్యానెల్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

4,750 పరీక్షా కేంద్రాల్లో, సమస్య ఆరు కేంద్రాల్లో మాత్రమే ఉంది, ప్రశ్నాపత్రాలను తప్పుగా పంపిణీ చేయడం వల్ల 24 లక్షల మంది అభ్యర్థులలో, 1,600 మంది అభ్యర్థులు మాత్రమే ప్రభావితమయ్యారు. దేశవ్యాప్తంగా ఈ పరీక్ష సమగ్రత కాపాడటంలో ఎలాంటి రాజీ పడలేదని ఆయన అన్నారు. పరీక్షలో తమకు తక్కువ సమయం లభించిందని కొంతమంది అభ్యర్థులు ఆరోపించారు. కేంద్రాల్లో ఉన్న సీసీటీవీలను పరిశీలించినట్లు NTA చీఫ్ తెలిపారు.

సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన కమిటీ వారంలోగా తమ సిఫార్సులను సమర్పిస్తుందని ఆయన అన్నారు. NTA జూన్ 4న నీట్ ఫలితాలను ప్రకటించింది. దీనిలో చాలా మంది విద్యార్థులు 718, 719 మార్కులు సాధించారు, 67 మంది విద్యార్థులు ఆలిండియా ఫస్ట్​ ర్యాంక్ సాధించగా, సర్వత్రా దీనిపై అనుమానాలు వ్యక్తమవడంతో పరీక్షలో అక్రమాలు జరిగాయని విద్యార్థులు ఆందోళన లేవనెత్తారు.


Similar News