ED Raids: ముడా కేసులో ఆరుచోట్ల ఈడీ దాడులు

కర్ణాటకలోని మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం సోదాలు నిర్వహించింది.

Update: 2024-10-28 10:41 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటకలోని మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం సోదాలు నిర్వహించింది. మంగళూరు, బెంగళూరు, మాండ్య, మైసూరు సహా ఆరు ప్రదేశాలలో సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ముడాకు చెందిన ఆరుగురు ఉద్యోగులకు ఏజెన్సీ సమన్లు జరీ చేసింది. బెంగళూరులోని ఈడీ జోనల్ కార్యాలయంలో ఉద్యోగులను అధికారులు విచారించారు. ఈ కేసుకు సంబంధించిన పలు డాక్యుమెంట్లను తీసుకురావాలని కూడా ఆదేశించారు. కాగా, ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రైవేట్ వ్యక్తులతో పాటు బిల్డర్ల ఆవరణలో సోదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు ఆయనతో సంబంధం ఉన్న పలువురు అధికారులకు సంబంధించిన ఆధారాలు వెలికి తీయడంపై ఈడీ దర్యాప్తు అధికారులు దృష్టి సారించారు. గతంలో అక్టోబర్‌లో, భూ కుంభకోణంపై విచారణకు సంబంధించి ముడా మైసూరు తాలూకా కార్యాలయాలపై ఈడీ రెండు బృందాలు దాడులు నిర్వహించాయి. ముడా కుంభకోణానికి సంబంధించి లోకాయుక్త దాఖలు చేసిన ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్‌ (FIR)ను పరిగణనలోకి తీసుకున్న ఈడీ.. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై కేసు నమోదు చేసింది.

బీజేపీ వర్సెస్ కాంగ్రెస్

మరోవైపు, ముడా స్కాం వ్యవహారం కర్ణాటకలో రాజకీయంగా చిచ్చురేపుతోంది. తనను రాజకీయంగా వేధింపులకు గురిచేస్తున్నానంటూ సిద్ధరామయ్య కేంద్రంపై ఆరోపణలు చేశారు. తనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. ఇకపోతే, సీఎం పదవి నుంచి వైదొలగాలని బీజేపీ నుంచి డిమాండ్లు వస్తున్నాయి. అయినప్పటికీ, తమ పార్టీ నేతల మద్దతుతో తాను రాజీనామా చేయబోనని సిద్ధరామయ్య ప్రకటించారు.


Similar News