కూతురితో కలిసి కూల్ డ్రింక్ తాగాడని మైనర్‌ను కిడ్నాప్ చేసిన తండ్రి!

కూతురితో కలిసి కూల్ డ్రింక్ తాగుతున్నాడని, ఓ తండ్రి మైనర్ ను కిడ్నాప్ చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది.

Update: 2024-06-30 11:00 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కూతురితో కలిసి కూల్ డ్రింక్ తాగుతున్నాడని, ఓ తండ్రి మైనర్ ను కిడ్నాప్ చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. బిత్తూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన ప్రకారం ఓ యువకుడు అమ్మాయితో కలిసి శీతల పానీయం తాగుతున్నాడు. అదే సమయంలో స్నేహితులతో అటుగా వెళ్లిన ఆ అమ్మాయి తండ్రి వారిద్దరినీ చూశాడు. దీంతో ఆగ్రహావేశాలు ఆపుకోలేక ఆ కుర్రాడిపై దాడి చేశాడు. అంతేగాక అతని స్నేహితులతో కలిసి ఆ యువకుడిని కిడ్నాప్ చేశారు. ఓ చీకటిగదిలో బంధించి అర్ధరాత్రి వరకు తీవ్రంగా కొట్టారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాలు, ఇంటెలిజెన్స్ సహాయంతో రాత్రికి రాత్రే కిడ్నాప్ ను చేధించారు.

కిడ్నాపర్ల చెర నుంచి మైనర్ ను స్వాధీనం చేసుకొని, సంఘటన స్థలంలోనే ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై బాధితుడు మాట్లాడుతూ.. ఆ బాలిక తన స్నేహితురాలు అని, ఆమె పిలవడం వల్లే అక్కడికి వెళ్లానని, ఇంతలో ఆమె తండ్రి వచ్చి తీసుకెళ్లి కొట్టారని పేర్కొన్నాడు. నింధితులపై పలు సెక్లన్ల కింద కేసు నమోదు చేశామని, చికిత్స కోసం మైనర్ ను స్థానిక ఆసుపత్రికి పంపించామని అదనపు డిప్యూటీ కమీషనర్ విజయేంద్ర ద్వివేది వెల్లడించారు. అయితే కిడ్నాప్ చేసిన ఆ బాలిక తండ్రితో పాటు అతడి స్నేహితులు కాన్పూర్ కోర్టులో న్యాయవాదులు గా పనిచేస్తున్నారు. దీంతో ఈ కేసుపై ఆగ్రహించిన లాయర్లు, పోలీస్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. తప్పుడు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారని లాయర్లు ఆందోళన చేపట్టారు.

Similar News