Tamil Nadu: భారీ వర్షాల హెచ్చరిక.. వాహనాలను కాపాడుకునేందుకు ప్రజల వినూత్న ఆలోచన

ఈశాన్య రుతుపవనాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతవరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Update: 2024-10-14 12:26 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఈశాన్య రుతుపవనాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతవరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో తమిళనాడు ప్రభుత్వం పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించడమే గాక ఆయా జిల్లాల ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే చెన్నై దగ్గరలోని వెలచ్చేరి ప్రజలు అప్రమత్తమయ్యారు. వరదల్లో తమ వాహనాలు కొట్టుకుపోకుండా కాపాడుకునేందుకు వినూత్న ఆలోచన చేశారు. కార్లను వెలచ్చేరిలోని ఓ ఫ్లైఓవర్ పై పార్కింగ్ చేసి ఉంచారు. ఈ విషయం తెలుసుకున్న మరి కొందరు స్థానికులు తమ కార్లను ఫ్లైఓవర్ పై నిలుపుకునేందుకు స్థలాన్ని రిజర్వు చేసుకోడానికి వచ్చారు. ఇందులో ఓ వ్యక్తి మాట్లాడుతూ.. గత సంవత్సరం కూడా ఈ ప్రాంతం వరదలకు గురైందని, అందులో తన కారు పాడైందని తెలిపాడు. అలాగే గతంలో పాడైన కారుకు బీమా క్లెయిమ్ చేయడం కోసం ఇప్పటికీ వర్క్‌షాప్‌లోనే ఉంచాల్సి వచ్చిందని, అందుకే ఇక్కడ పార్క్ చేసేందుకు వచ్చినట్లు చెప్పాడు.

Similar News