సియాచిన్ దేశ సార్వభౌమత్వానికి ప్రతీక: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

లడఖ్‌లోని ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధభూమి సియాచిన్‌పై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రశంసలు కురిపించారు. సియాచిన్ దేశ సార్వభౌమత్వానికి, పట్టుదలకు ప్రతీక అని కొనియాడారు.

Update: 2024-04-22 09:25 GMT

దిశ, నేషనల్ బ్యూరో: లడఖ్‌లోని ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధభూమి సియాచిన్‌పై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రశంసలు కురిపించారు. సియాచిన్ దేశ సార్వభౌమత్వానికి, పట్టుదలకు ప్రతీక అని కొనియాడారు. సోమవారం ఆయన సియాచిన్‌ను సందర్శించారు. యుద్ధ స్మారకం వద్ద పుష్ప గుచ్చం ఉంచి అమరవీరులకు నివాళులర్పించారు. ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండేతో కలిసి ఈ ప్రాంతంలోని మొత్తం భద్రతా పరిస్థితిని సమీక్షించారు. అనంతరం సైనికులను ఉద్దేశించి మాట్లాడారు. దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబై అయితే సియాచిన్ మాత్రం ధైర్యానికి రాజధాని అని చెప్పారు. గత కొన్నేళ్లుగా సియాచిన్‌లో భారత సైన్యం తన ఉనికిని పటిష్టం చేసుకుందని వెల్లడించారు. సియాచిన్‌లో ఉండి దేశాన్ని రక్షిస్తున్నందుకు సైనికులందరికీ అభినందనలు తెలిపారు.

కారాకోరం పర్వత శ్రేణిలో దాదాపు 20,000 అడుగుల ఎత్తులో ఉన్న సియాచిన్ గ్లేసియర్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం. ఇక్కడ సైనికులు గడ్డకట్టడం, బలమైన గాలులు వంటి సవాళ్లను ఎదుర్కొంటారు. అయితే ఇటీవలి సంవత్సరాలలో ఈ ప్రాంతంలో మెరుగైన మౌలిక సదుపాయాల కారణంగా. సైనికుల కార్యాచరణ సామర్థ్యాలు గణనీయంగా పెరిగినట్టు తెలుస్తోంది. వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతంలో భారత సైన్యం ఉనికిలోకి వచ్చి 40 ఏళ్లు పూర్తి చేసుకున్న వారం తర్వాత రాజ్ నాథ్ పర్యటన జరగడం గమనార్హం. 1984 ఏప్రిల్13న ‘ఆపరేషన్ మేఘదూత్’ చేపట్టిన భారత సైన్యం సియాచిన్‌పై పూర్తి నియంత్రణ సాధించింది. 

Tags:    

Similar News