Sharad pawar: 90 ఏళ్లు వచ్చినా రెస్ట్ తీసుకోను: ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్ పవార్
మహారాష్ట్రను సరైన దారిలోకి తెచ్చే వరకు విశ్రాంతి తీసుకోబోనని ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ అన్నారు.
దిశ, నేషనల్ బ్యూరో: తన వయసుతో సంబంధం లేకుండా మహారాష్ట్రను సరైన దారిలోకి తెచ్చే వరకు విశ్రాంతి తీసుకోబోనని ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ అన్నారు. సతారా జిల్లాలోని ఫాల్తాన్లో తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘తమ పార్టీకి చెందిన కొందరు యువకులు తన చిత్రాలతో కూడిన బ్యానర్లను ఏర్పాటు చేయడం నేను చూశాను. ఆ బ్యానర్లలో 84 ఏళ్ల వృద్ధుడిగా చూపెట్టారు. కానీ మీరు ఆందోళన చెందకండి.. ఎందుకంటే 84 లేదా 90 కావచ్చు. ఈ వృద్ధుడు ఆగడు. రాష్ట్రాన్ని తీసుకువచ్చే వరకు రెస్ట్ తీసుకోడు. సరైన మార్గంలో నడిచి రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకొస్తా’ అని వ్యాఖ్యానించారు. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. సింధుదుర్గ్ జిల్లాలోని రాజ్కోట్ కోటలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కూలిన ఘటనే అందుకు నిదర్శనమని నొక్కి చెప్పారు. వారి చేతుల్లోంచి అధికాం లాక్కోవడమే తన ముందున్న లక్ష్యమని చెప్పారు. కాగా, 288 అసెంబ్లీ నియోజకవర్గాలున్న మహారాష్ట్రలో నవంబర్ 20న ఎన్నికలు జరగనుండగా, అదే నెల 23న ఫలితాలు వెలువడనున్నాయి.