రాజ్‌కోట్ అగ్నిప్రమాద ఘటనలో పోలీసులు సహా 7 మంది అధికారులు సస్పెండ్

సిట్ సమర్పించిన నివేదిక ఆధారంగా అధికారులను సస్పెండ్ చేసినట్టు రాష్ట్ర హోం మంత్రి హర్ష్ సంఘవి చెప్పారు.

Update: 2024-05-27 16:15 GMT

దిశ, నేషనల్ బ్యూరో: గేమింగ్ జోన్‌లో 27 మంది ప్రాణాలను బలిగొన్న అగ్నిప్రమాదానికి సంబంధించి గుజరాత్ ప్రభుత్వం సోమవారం ఏడుగురు అధికారులను సస్పెండ్ చేసింది. అవసరమైన అనుమతులు లేకుండా గేమ్ జోన్‌ను నిర్వహించేందుకు అంగీకరించడంలో తీవ్ర నిర్లక్ష్యం వహించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. సిట్ సమర్పించిన నివేదిక ఆధారంగా అధికారులను సస్పెండ్ చేసినట్టు రాష్ట్ర హోం మంత్రి హర్ష్ సంఘవి చెప్పారు. సస్పెండ్ చేసిన వారిలో రాజ్‌కోట్ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగం అసిస్టెంట్ ఇంజనీర్ జైదీప్ చౌదరి, ఆర్‌ఎంసీ అసిస్టెంట్ టౌన్ ప్లానర్ గౌతమ్ జోషి, రాజ్‌కోట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్‌మెంట్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఎంఆర్ సుమ, పరాస్ కొఠియా, పోలీస్ ఇన్‌స్పెక్టర్లు వీఆర్ పటేల్, ఎన్‌ఐ రాథోడ్‌లు ఉన్నారు. పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్నారని, మరికొందరిని అరెస్ట్ చేసేందుకు 17 బృందాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. బాధితుల డీఎన్ఏ ధృవీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. గేమ్ జోన్‌లోని ఆరుగురు పార్ట్‌నర్లు, మరొక నిందితుడిపై వివిధ ఆరోపణల ఆధారంగా ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

అగ్నిప్రమాద ఘటనపై గుజరాత్ హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టడంతో రాష్ట్ర అధికారులపై ప్రభుత్వం తీవ్రస్థాయిలో చర్యలు తీసుకుంది. ఇది మానవ విపత్తుగా పేర్కొన్న కోర్టు, మునిసిపల్ కార్పొరేషన్ తమ పరిధిలో ఇంత పెద్ద నిర్మాణం జరిగితే కళ్లు మూసుకుని ఉందా అని ఆగ్రహించింది. గేమ్ సెంటర్‌ను ఏర్పాటు చేసిన 2021 నుంచి ఉన్న కమిషనర్లు దీనికి బాధ్యత వహించాలని, ప్రత్యేక అఫిడవిట్‌లను అందించాలని ఆదేశించింది. ఈ వ్యవాహరంలో రాజ్‌కోట్ పోలీస్ చీఫ్ రాజు భార్గవ బదిలీ అయ్యారు. ప్రస్తుతానికి ఆయనకు కొత్త పదవి ఇవ్వలేదు. ఆయన స్థానంలో అహ్మదాబాద్‌లోని స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ బ్రజేష్ కుమార్ ఝా నియమితులయ్యారు. ఆయనతో పాటు రాజ్‌కోట్ సిటీ అడిషనల్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (పరిపాలన, ట్రాఫిక్, క్రైమ్) విధి చౌదరి కూడా తొలగించబడ్డారు. ఆమె స్థానంలో కచ్-భుజ్ (పశ్చిమ) జోన్‌ మాజీ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ మహేంద్ర బగ్రియా వచ్చారు. 

Tags:    

Similar News