ఏ క్షణమైనా రాజకీయాలు మారిపోవచ్చు.. ఎన్డీఏ కూటమిపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు

కేంద్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ నేతృత్వంలోని కొందరు నేతలు తమతో టచ్ లో ఉన్నారని తెలిపారు.

Update: 2024-06-18 11:32 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ నేతృత్వంలోని కొందరు నేతలు తమతో టచ్ లో ఉన్నారని తెలిపారు. ఫైనాన్షియల్ టైమ్స్ అనే మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ ఈ కామెంట్లు చేశారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని కూటమిలో తీవ్ర అసంతృప్తి ఉందన్నారు. లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయన్నారు. అయితే, అధికార కూటమి నుంచి ఆయనకు టచ్ లో ఉన్న నేతలు వివరాలు వెల్లడించలేదు.

రాజకీయాలు మారిపోయే ఛాన్స్

మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మనుగడ కోసం ఇబ్బందిపడే అవకాశం ఉందని రాహుల్ గాంధీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం బలహీనంగా ఉందన్నారు. రెండు కూటముల మధ్య ఎంపీల సంఖ్యలో అత్యల్ప తేడా ఉందన్నారు. ఏ చిన్న సమస్య వచ్చినా ప్రభుత్వం పడిపోతుందన్నారు. ఏక్షణమైనా రాజకీయాలు మారిపోయే అవకాశం ఉందన్నారు. అలాగే ఎన్నికల టైంలో మోడీ చేసిన ప్రసంగాలను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. మోడీ విద్వేషాన్ని వ్యాప్తి చేసి.. ఫలితాలు పొంది ఉండొచ్చన్నారు. అయితే, ఈసారి మాత్రం ఆ ఆలోచనను ప్రజలు తిరస్కరించారన్నారు. వివక్ష లేని పరిస్థితులు ఉంటే.. ఇండియా కూటమికే మెజార్టీ వచ్చి ఉండేదన్నారు. నిస్సహాయస్థితిలోనే తాము పోరాడమని అన్నారు. అలాంటి టైంలో ఏం చేయాలో ప్రజలకు తెలుసు అని.. దానికి నిదర్శనమే ఈ ఫలితాలు అని పేర్కొన్నారు. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ స్వయంగా మెజార్టీ సాధించింది. కానీ ఈసారి మాత్రం 240 సీట్లకే పరిమితమైంది. దాంతో ఎన్డీయే కూటమి పక్షాలపై బీజేపీ ఆధారపడింది. మరోవైపు కాంగ్రెస్ కు ఈసారి 99 స్థానాలు వచ్చాయి. ఇండియా కూటమికి 230కి పైగా సీట్లు వచ్చాయి. పార్లమెంటు సమావేశాల ముందు రాహుల్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Similar News