ఫ్రాన్స్ 'బాస్టిల్ డే' వేడుకలకు ప్రధాని నరేంద్ర మోడీ..
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జూలై 13, 14 తేదీలలో ఫ్రాన్స్లో పర్యటించనున్నారు.
పారిస్ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జూలై 13, 14 తేదీలలో ఫ్రాన్స్లో పర్యటించనున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ అహ్వానం మేరకు 14న జరిగే బాస్టిల్ డే పరేడ్ వేడుకల్లో మోడీ గౌరవ అతిథిగా పాల్గొననున్నారు. ఈ ప్రోగ్రాంలో భారత త్రివిధ దళాలకు చెందిన 269 మంది సైనికులు ఫ్రెంచ్ దళాలతో కలిసి కవాతు చేస్తారు. మూడు రాఫెల్ జెట్లు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన గ్లోబ్మాస్టర్ C-17 జెట్స్ కలిసి వైమానిక విన్యాసాలు చేయనున్నాయి. మోడీని బాస్టిల్ డే పరేడ్కు ఆహ్వానించడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొంటూ మేక్రాన్ ట్వీట్ చేశారు.
ఈ పర్యటనలో ప్రధాని మోడీ ఫ్రాన్స్ దిగ్గజ కంపెనీల సీఈవోలతో సమావేశం అవుతారని, ప్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్తో ద్వైపాక్షిక సమావేశాలు జరుపుతారని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఫ్రాన్స్ పర్యటన ముగిసిన అనంతరం ప్రధాని మోడీ 15న అబుదాబిలో పర్యటిస్తారు. యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో మోడీ చర్చలు జరుపుతారు.