రేపు షాంఘై సహకార సదస్సు..
షాంఘై సహకార సంస్థ (ఎస్ సీవో) సదస్సు భారత్ అధ్యక్షతన మంగళవారం వర్చువల్ విధానంలో జరగనుంది.
న్యూఢిల్లీ : షాంఘై సహకార సంస్థ (ఎస్ సీవో) సదస్సు భారత్ అధ్యక్షతన మంగళవారం వర్చువల్ విధానంలో జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షత వహించనున్న ఈ సదస్సు లో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ , రష్యా అధ్యక్షుడు పుతిన్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తదితర ఎస్ సీవో దేశాల నేతలు పాల్గొననున్నారు. అఫ్గానిస్థాన్లో పరిస్థితి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, షాంఘై సభ్యదేశాలకు సహకార విస్తరణపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.
దేశాల మధ్య అనుసంధానాన్ని, వాణిజ్యాన్ని పెంపొందించడంపై కూడా చర్చ జరుగుతుంది. లడఖ్ సరిహద్దులో భారత్, చైనా దేశాల మధ్య గత మూడేళ్లుగా కొనసాగుతున్న ప్రతిష్ఠంభన అంశం కూడా ప్రస్తావనకు రావచ్చని భావిస్తున్నారు. భారత్, చైనా, రష్యా, పాకిస్థాన్, కజకిస్థాన్, కిర్గిస్థాన్, తజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్ దేశాల ప్రాతినిధ్యంతో కూడిన ఈ షాంఘై సహకార గ్రూపులో కొత్త శాశ్వత సభ్యదేశంగా ఇరాన్ చేరనుంది.