దేశవ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు

ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసు విచారణలో భాగంగా ఎన్ఐఏ దేశవ్యాప్తంగా సోదాలు చేపట్టింది. 5 రాష్ట్రాల్లోని 22 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తోంది.

Update: 2024-10-05 04:19 GMT

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. మొత్తం 22 ప్రాంతాల్లో ఎన్ఐఏ (NIA) ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తోంది. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసు (Terror Conspiracy Case) విచారణలో భాగంగా ఈ తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. జమ్ము కశ్మీర్, మహారాష్ట్ర, అస్సాం, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాల్లో సోదాలు చేసిన ఎన్ఐఏ అధికారులు.. మహారాష్ట్రలో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

గత నెల 20న పంజాబ్ లోని 13 ప్రాంతాల్లోనూ ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. సెప్టెంబర్ 24న తమిళనాడులో కూడా సోదాలు నిర్వహించింది. తాంబరం, పుదుక్కొట్టై, కన్యాకుమారి ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. 

ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో ఇప్పటికే లోక్ సభ ఎంపీ ఇంజనీర్ రషీద్ ను అరెస్ట్ చేశారు. గత నెల 10న మధ్యంతర బెయిల్ పొందగా.. దాని గడువు అక్టోబర్ 2తో ముగిసింది. 2017లో టెర్రర్ ఫండింగ్ కేసులో రషీద్ ను నిందితుడిగా గుర్తిస్తూ.. ఎన్ఐఏ 2019లో అరెస్ట్ చేసింది. అలాగే కశ్మీర్ వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్, హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్ లపై ఛార్జిషీట్ దాఖలు చేయగా.. మాలిక్ నేరాన్ని అంగీకరించడంతో 2022లో ట్రయల్ కోర్టు జీవితఖైదు శిక్ష విధించింది.


Similar News