'తొలి పీఎం నెహ్రూ కాదు.. నేతాజీ!'.. బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
కేంద్ర మాజీ మంత్రి, కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసన్గౌడ పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
బెంగళూరు : కేంద్ర మాజీ మంత్రి, కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసన్గౌడ పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కాదని, నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని ఆయన వ్యాఖ్యానించారు. కర్ణాటకలో నిర్వహించిన ఓ బహిరంగ సమావేశంలో పాటిల్ ఈ కామెంట్స్ చేశారు. ‘‘మన దేశానికి తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కాదు.. నేతాజీ సుభాష్ చంద్రబోసే తొలి ప్రధాని’’ అని అన్నారు. బ్రిటీష్ వాళ్లకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ భయం రుచిని చూపించినందు వల్లే వాళ్లు దేశాన్ని విడిచి పారిపోయారని చెప్పారు. ‘‘భారతీయులు చేసే నిరాహార దీక్షల వల్ల గానీ.. సత్యం, ధర్మమంటూ ఒక చెంపపై కొడితే మరో చెంప చూపించడం వల్లగానీ దేశానికి స్వాతంత్ర్యం రాలేదు. కేవలం బ్రిటీషర్లను భయపెట్టడం వల్లే స్వాతంత్ర్యం సిద్ధించింది’’ అని బసన్గౌడ పాటిల్ పేర్కొన్నారు.
ఇదే విషయాన్ని బాబాసాహెబ్ అంబేడ్కర్ తాను రాసిన ఓ పుస్తకంలోనూ ప్రస్తావించారని ఆయన చెప్పారు. ‘‘రెండో ప్రపంచయుద్ధం ముగిసిన తర్వాత బ్రిటీష్వాళ్లు భారత్ను విడిచిపెట్టారు. ఆ సమయానికి మన దేశంలోని కొన్ని ప్రాంతాల వారికి సొంత కరెన్సీ, సొంత జెండా, జాతీయ గీతం కూడా ఉండేవి. ఆ నాటికి దేశ ప్రధాని సుభాష్ చంద్రబోస్. అందుకే నెహ్రూ మన తొలి ప్రధాని కాదు.. ఇదే విషయాన్ని ప్రధాని మోడీ కూడా చెబుతుంటారు’’ అని తన అభిప్రాయాన్ని బసన్గౌడ సమర్ధించుకున్నారు.