కేంద్ర కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలివే.. ఆ పథకంతో 80 కోట్లమందికి లబ్ధి

ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో.. కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. 80కోట్ల మందికి లబ్ధి చేకూరేలా పోర్టిఫైడ్ రైస్ ను సరఫరా చేయనున్నట్లు మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.

Update: 2024-10-09 10:23 GMT

దిశ, వెబ్ డెస్క్: ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేబినెట్ కీలక నిర్ణయాలు (Central Cabinet Decisions) తీసుకుంది. ఆ వివరాలను మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Minister Ashwini Vaishnav)వెల్లడించారు. గుజరాత్ లో నేషనల్ మారిటైం హెరిటేజ్ కాంప్లెక్స్ ఏర్పాటుకు కేంద్రమంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. లోథల్ వద్ద ఈ హెరిటేజ్ కాంప్లెక్స్ ను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. అలాగే పంబాజ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో రూ.4,406 కోట్ల వ్యయంతో సరిహద్దు రోడ్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. వైబ్రంట్ విలేజ్ కార్యక్రమం కింద రోడ్లు, టెలికాం, నీటి సరఫరా, ఆరోగ్యం, విద్య అందించేందుకు ఆమోదం తెలిపింది. అలాగే పాకిస్తాన్ సరిహద్దు వెంబడి ఉన్న గ్రామాలకు కనెక్టయ్యేలా 2,208 కిలోమీటర్ల మేర రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లో కొత్తరోడ్లను నిర్మించాలని నిర్ణయించింది. గ్రామాలను హైవేలతో కలపడం ద్వారా సరిహద్దు గ్రామాల అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలను కేబినెట్ సిద్ధం చేసిందని తెలిపారు.

ఐసీడీఎస్, పీఎం పోషణ సహా.. అన్ని పథకాల ద్వారా రూ.17,082 కోట్ల వ్యయంతో ఫోర్టిఫైడ్ రైస్ ను సరఫరా చేసేందుకు కేంద్రమంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు కేంద్రమంత్రి అశ్వినీవైష్ణవ్ వెల్లడించారు. రక్తహీనత, శరీరంలో మైక్రో- న్యూట్రియంట్ల కొరతను అధిగమించడమే దీని ప్రధాన లక్ష్యంగా పేర్కొంది. 2028 డిసెంబర్ వరకూ ఈ పథకం అమలు అవుతుందని, ఇది పూర్తిగా కేంద్ర నిధులతోనే జరుగుతుందని తెలిపారు. ఈ పథకం ద్వారా దేశంలో 80 కోట్లమంది ప్రజలు పోషకాహార లోపాన్ని అధిగమించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. దీనిపై నీతిఅయోగ్ పూర్తిగా పరిశోధన చేసిందని, మామూలు బియ్యంతోనే వీటిని తయారు చేస్తారని తెలిపారు.

2019 నుంచి 2021 మధ్య దేశంలో నిర్వహించిన ఆరోగ్య సర్వేలో రక్తహీనత సమస్య అధికంగా ఉన్నట్లు తేలిందని, అన్నివయసుల వారిలో ఈ లోపం కనిపించిందని అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఐరన్, విటమిన్ B12, ఫోలిక్ యాసిడ్ వంటి లోపాలు కనిపించాయన్నారు. ఆ సర్వే ఆధారంగానే ఫోరిఫైడ్ రైస్ ను సరఫరా చేయాలని నిర్ణయించినట్లు వివరించారు. 

Similar News