చెన్నై: తమిళనాడులో దారుణం జరిగింది. నీట్ పరీక్షలో అర్హత సాధించలేదనే మనస్థాపంతో విద్యార్థి జగదీశ్వరన్ (19) శనివారం సూసైడ్ చేసుకోగా.. కొడుకు మరణాన్ని తట్టుకోలేక తండ్రి సెల్వశేఖర్ సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రీ కొడుకుల ఆత్మహత్యలపై తమిళనాడు సీఎం స్టాలిన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇవే చివరి నీట్ మరణాలు కావాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్యలకు పాల్పడొద్దని నీట్ విద్యార్థుల్ని కోరారు. నీట్ని రద్దు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుపై తాత్సారం చేస్తున్న రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవిపై విమర్శలు గుప్పించారు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలై.. రాజకీయ మార్పులు చోటుచేసుకుంటే.. వాళ్లు (గవర్నర్) ఎలాగూ కనిపించకుండా పోతారని కామెంట్ చేశారు. "స్టూడెంట్స్ ఎదుగుదలకు ఆటంకంగా ఉన్న నీట్ పరీక్ష కచ్చితంగా రద్దయి తీరుతుంది. అందుకోసం ప్రభుత్వం న్యాయపరమైన మార్గం ద్వారా ప్రయత్నాలు చేస్తోంది" అని స్టాలిన్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ ఆర్ఎన్ రవి ఇస్తున్న తేనెటి విందును బహిష్కరిస్తున్నట్లు స్టాలిన్ ప్రకటించారు. మరోవైపు సెల్వశేఖర్ కుటుంబ సభ్యులను స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ పరామర్శించారు.