Manipur BJP MLAs: మణిపూర్ సీఎంని తొలగించాలని ప్రధానికి లేఖ

మణిపూర్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. కాగా.. ఈ నేపథ్యంలో అధికార బీజేపీలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది.

Update: 2024-10-18 05:57 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మణిపూర్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. కాగా.. ఈ నేపథ్యంలో అధికార బీజేపీలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. 19 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి బీరెన్ సింగ్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఈ లేఖపై సంతకం చేసిన వారిలో అసెంబ్లీ స్పీకర్ తోంగ్ చోమ్ సత్యవ్రత్ సింగ్, మంత్రి తొంగం విశ్వజిత్ సింగ్, యుమ్నం ఖేమ్‌చంద్ సింగ్ ఉన్నారు. కాగా, మంగళవారం ఢిల్లీలో జరిగిన మైటీ, కుకీ, నాగా ఎమ్మెల్యేల సమావేశం తర్వాత ఈ లేఖ రాశారు. అయితే, అధికార పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు బుధవారం ప్రధానికి లేఖ అందించినట్లు పార్టీ వర్గాల నుంచి సమాచారం వచ్చింది. శాంతిస్థాపన, సాధారణ పరిస్థితుల పునరుద్ధరణతో పాటు పౌరుల కష్టాలను దూరం చేయడంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వ సామర్థ్యాన్ని మణిపూర్ ప్రజలు ప్రశ్నిస్తున్నారని ఆ లేఖలో ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే సమస్యకు పరిష్కారం దక్కకుంటే రాజీనామ చేయాలని ప్రజలు కోరుతున్నట్లు వెల్లడించారు.

బీజేపీ ఎమ్మెల్యేలు ఏమన్నాంటే?

కాగా, బీజేపీ మద్దతుదారులు, ప్రజల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ తీసుకునే తాము.. అందుకే ఈ నిర్ణయానికి వచ్చామని కాషాయ పార్టీ మ్మెల్యేలు తెలిపారు. మణిపూర్‌ లో హింసను ఆపడమే కాకుండా.. ఇక్కడ బీజేపీ పతనం నుంచి రక్షించడం కూడ తమ బాధ్యతగా భావిస్తున్నామని మోడీకి రాసిన లేఖలో ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. రెండు వర్గాల మధ్య కొనసాగుతున్న విభేదాలు, చెలరేగితున్న హింస దృష్ట్యా ప్రస్తుత ముఖ్యమంత్రిని తొలగించడమే సరైన పరిష్కారమని 19 మంది ఎమ్మెల్యేలు చెప్పుకొచ్చారు. అయితే, కేవలం భద్రతా బలగాలను మోహరించినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదని పేర్కొన్నారు. ఈ ఘటన దేశంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందన్నారు. ఇరు వర్గాల మధ్య సయోధ్య, శాంతిని పెంపొందించడానికి చర్చలకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించేందుకు చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యేలు కోరారు.


Similar News