Tamil Nadu: వారికి రాముడి గురించి తెలియదు.. తమిళప్రజలపై గవర్నర్ వ్యాఖ్యలు

తమిళనాడు(Tamil Nadu) ప్రజలకు రాముడి గురించి తెలియదని గవర్నర్ ఆర్ ఎన్ రవి(Tamil Nadu Governor RN Ravi) కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-09-15 05:02 GMT

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడు(Tamil Nadu) ప్రజలకు రాముడి గురించి తెలియదని గవర్నర్ ఆర్ ఎన్ రవి(Tamil Nadu Governor RN Ravi) కీలక వ్యాఖ్యలు చేశారు. రాముడు ఉత్తరాదికే(North India) దేవుడు అన్న భావనను తమిళ ప్రజల్లో కల్పించారని గవర్నర్‌ అన్నారు. అందుకే, రాముడి గురించి తమిళనాడు ప్రజలకు పెద్దగా తెలియదన్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ బహిరంగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో రాముడు(Lord Ram) తిరగని ప్రదేశం లేదని, ఆయన ప్రతి ఒక్కరి హృదయాల్లో, మనసుల్లో నివసిస్తారని పేర్కొన్నారు. ‘ యువత మన సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని కోల్పోయారు. యువతకు భారత సంస్కృతి తెలియకుండా ఉండేందుకు సాంస్కృతిక హననం చేశారు. దేశంలోని మిగిలిన ప్రాంతాలతో, మన గతంతో మనకున్న సంబంధాన్ని చెరిపివేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సాంస్కృతిక మారణహోమం ద్వారా భిన్నమైన గుర్తింపును సృష్టించడం కోసం యత్నిస్తున్నారు.’ అని డీఎంకే సర్కారుపై(MK Stalin government) గవర్నర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

సనాతన ధర్మంపై వ్యాఖ్యలు

సనాతన ధర్మంపై గతంలో సీఎం స్టాలిన్‌ తనయుడు, రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్‌(Udayanidhi Stalin) చేసిన కామెంట్లపైన గవర్నర్ విమర్శలు గుప్పించారు. ‘ కొందరు సనాతన ధర్మంపై దాడి చేశారు. సనాతన ధర్మాన్ని డెంగ్యూ,మలేరియా వైరస్‌లతో పోల్చారు. వారికేమైందో తెలియదు కానీ ఆ అంశంపై ఇప్పుడేం మాట్లాడడం లేదు. ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు’ అని ఉదయనిధిని ఉద్దేశించి రవి మాట్లాడారు. తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వానికి, గవర్నర్ రవికి మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ప్రభుత్వంపైన బహిరంగంగానే గవర్నర్ అసంతృప్తి తెలుపుతున్నారు. కాగా.. ఇటీవలే తమిళనాడు ప్రభుత్వ పాఠశాలల్లో బోధనలో నాణ్యతా ప్రమాణాలు లేవని, చిన్నారులు కనీసం రెండంకెల సంఖ్యను కూడా గుర్తించలేదని గవర్నర్ విమర్శించారు. అయితే, గవర్నర్ ద్వారా రాష్ట్రాన్ని నియంత్రించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని అధికార డీఎంకే ఆరోపిస్తోంది.


Similar News