Mohan Bhagwat: విభేదాలను గౌరవించి సామరస్యంగా జీవించండి.. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
విభేదాలను గౌరవించాలని, సామరస్యంతో జీవించడానికి ప్రయత్నించాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సూచించారు.

దిశ, నేషనల్ బ్యూరో: విభేదాలను గౌరవించాలని, సామరస్యంతో జీవించడానికి ప్రయత్నించాలని ఆర్ఎస్ఎస్ (Rss) చీఫ్ మోహన్ భగవత్ (Mohan bhagavath) సూచించారు. మహారాష్ట్ర (Maharashtra)లోని థానే జిల్లా భివాండి నగరంలోని ఓ కళాశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం ఆయన ప్రసంగించారు. రిపబ్లిక్ డే ఒక వేడుక మాత్రమే కాదని, దేశం పట్ల మన బాధ్యతలను గుర్తుచేసుకునే అవకాశం కూడా అని తెలిపారు. యువత దేశభక్తిని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ‘భారత్ వెలుపల భిన్నత్వం కారణంగా ఘర్షణలు జరుగుతున్నాయి. వైవిధ్యాన్ని జీవితంలో భాగంగా పరిగణిస్తాం. ప్రతి ఒక్కరికీ సొంత ప్రత్యేకతలు కలిగి ఉండొచ్చు. కానీ ఒకరికొకరు గౌరవించుకోవాలి’ అని వ్యాఖ్యానించారు. నగరంలో ఏదైనా సమస్య ఉంటే ఏ కుటుంబం సంతోషంగా ఉండలేదన్నారు. సమైఖ్య జీవనం ఎంతో అవసరమని నొక్కి చెప్పారు.