Mobile internet services: జార్ఖండ్ లో రెండ్రోజుల పాటు ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
జార్ఖండ్ లో ప్రభుత్వ పరీక్షల దృష్ట్యా హేమంత్ సోరెన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. శని, ఆదివారాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
దిశ, నేషనల్ బ్యూరో: జార్ఖండ్ లో ప్రభుత్వ పరీక్షల దృష్ట్యా హేమంత్ సోరెన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. శని, ఆదివారాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను (recruitment test) నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈనెల 21, 22న జార్ఖండ్ జనరల్ గ్రాడ్యూయేట్ లెవల్ కంబైన్డ్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ పరీక్షలు జరుగుతున్నాయి. దాదాపు 823 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరగుతున్నాయి. మొత్తం 6.39 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. అయితే, ఇలాంటి టైంలో జార్ఖండ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
హేమంత్ సర్కారు నిర్ణయం
ఇటీవలే నీట్ పరీక్షలో అవకతవకలు, ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. దీంతో, జార్ఖండ్ ప్రభుత్వ పరీక్ష దృష్ట్యా ఎలాంటి అవకతవకలు, లీకేజీలు జరగకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. హేమంత్ సోరెన్ సర్కారు నిర్ణయంతో రోజుకు దాదాపు ఐదు గంటల పాటు ఇంటర్నెట్ సేవల్లో అంతరాకం కలగనుంది. రెండు రోజులు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకూ ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటనలో వెల్లడించింది.