J-K Assembly elections: జమ్ముకశ్మీర్ ఎన్నికలపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
జమ్ముకశ్మీర్ లో మూడు కుటుంబాలు హింసను ప్రేరేపించాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో: జమ్ముకశ్మీర్ లో మూడు కుటుంబాలు హింసను ప్రేరేపించాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మూకశ్మీర్లోని మెంధార్లో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగానే ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు గుప్పించారు. గాంధీ, ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా కుటుంబం జమ్ముకశ్మీర్ ప్రజాస్వామ్యాన్ని అడ్డుకుంటున్నాయని అన్నారు. జమ్మూలో మూడు కుటుంబాల హింసను ప్రేరేపించాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. 2014లో మోడీ ప్రభుత్వం రాకపోయి ఉంటే జమ్ముకశ్మీర్ లో ఎప్పటికీ పంచాయతీ, బ్లాక్, జిల్లా ఎన్నికలు జరిగేవి కావన్నారు. కాబట్టి ఆ మూడు పార్టీల( కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ) వారసత్వ రాజకీయాలకు ముగింపు పలకాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఉగ్రవాదాన్ని అంతం చేశాం
మోడీ ప్రభుత్వం జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదాన్ని అంతం చేసిందని కేంద్రహోంమంత్రి అమిత్ షా అన్నారు. జమ్ముకశ్మీర్ లో యువతకు రాళ్లకు బదులు ల్యాప్టాప్లు ఇచ్చిందని గుర్తుచేశారు. ఈ ఎన్నికలు గాంధీ, ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా అనే మూడు కుటుంబాల పాలనను అంతం చేయబోతున్నాయని అమిత్ షా పేర్కొన్నారు. ‘‘1990ల్లో ఇక్కడి సోదరులు ధైర్యసాహసాలతో బుల్లెట్లను ఎదుర్కొన్నారు. 1947 నుంచి పాకిస్థాన్తో జరుగుతున్న ప్రతీ యుద్ధంలో సైనికులు జమ్మూ సరిహద్దుల్లో ఉంటూ దేశాన్ని రక్షిస్తున్నారు’’ అని అమిత్షా సైనికుల త్యాగాలను స్మరించుకున్నారు.