బీహార్లో 30 మందికి చేరిన నీట్ ప్రశ్నాపత్రాలు
ఈ కేసుకు సంబంధించి బీహార్లో ఇప్పటివరకు 13 మందిని అరెస్టు చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో: మెడికల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి బీహార్లో అరెస్టయిన ముగ్గురు వ్యక్తుల వద్ద అన్ని ప్రశ్నాపత్రాలు, సమాధాన పత్రాల కాపీలు ఉన్నాయని పోలీసులు దర్యాప్తులో తేలిందని హెచ్ఆర్డీ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ కేసుకు సంబంధించి బీహార్లో ఇప్పటివరకు 13 మందిని అరెస్టు చేశారు. నలుగురు నీట్ అభ్యర్థుల నుంచి అడ్మిట్ కార్డులు, ఐఫోన్ 15 ప్లస్, వన్ ప్లస్ మొబైల్ ఫొటో కాపీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సికందర్ యద్వెందు, అఖిలేష్ కుమార్, బిట్టు కుమార్ అనే వ్యక్తులను విచారించిన తర్వాత నలుగురు అభ్యర్థుల మధ్య పేపర్లు, జవాబు పత్రాల సర్క్యులేట్ అయ్యిందని పోలీసులు గుర్తించారు. ఈ కుట్రలో అరెస్టయిన వ్యక్తుల్లో సంజీవ్ సింగ్, రాకీ, నితీష్, అమిత్ ఆనంద్ ఉన్నారు. వీరితో పాటు మరో 25-30 మంది అభ్యర్థులకు కూడా ఆయా పత్రాలు అందాయని విచారణలో బహిర్గతమైంది. పరీక్షాల్లో పాస్ అయ్యేందుకు ఒక్కో అభ్యర్థి నుంచి రూ. 30-40 లక్షల వరకు వసూలు చేసినట్టు అరెస్ట్ అయిన వ్యక్తులు చెప్పారు. కగా, ఇప్పటికే ఈ వ్యవహారానికి సంబంధించి మానవ వనరుల శాఖ ఫిర్యాదు చేయడంతో సీబీఐ విచారణ చేపట్టింది. ఆదివారం కేసు కూడా నమోదు చేసింది.