Manipur: మణిపూర్‌లో కలకలం.. భారీగా ఆయుధాలు స్వాధీనం

అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి లభ్యం కావడం కలకలం రేపింది.

Update: 2024-10-10 05:36 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి లభ్యం కావడం కలకలం రేపింది. గత మూడు రోజులుగా మణిపూర్‌లోని వివిధ ప్రాంతాల్లో భద్రతా బలగాలు, పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు గురువారం తెలిపారు. ఇంఫాల్ తూర్పు జిల్లాలోని చంపాయ్ కొండ వద్ద చేసిన సోదాల్లో ఒక ఎం-16 రైఫిల్, 22 రైఫిల్స్, రెండు ఎస్ఎల్ఆర్‌లు, ఒక దేశీయ స్టెన్ గన్, రెండు కార్బైన్లు, ఎనిమిది దేశీయ పిస్టల్స్, 12 రెండు అంగుళాల మోర్టార్లను గుర్తించారు. అలాగే లువాంగ్‌షాంగ్‌బామ్ ప్రాంతంలో 32 పిస్టల్స్, 9 ఎంఎం పిస్టల్, రెండు హ్యాండ్ గ్రెనేడ్‌లు, మోర్టార్‌లు లభ్యమయ్యాయి.

ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని ఖేలాఖోంగ్‌, బిష్ణుపూర్ జిల్లాలోని గెల్‌బంగ్ గ్రామంలోనూ అనేక పరికరాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. చురచంద్‌పూర్‌లోని కంగ్‌వై వద్ద జరిగిన దాడిలో పంపి అని పిలువబడే రెండు అధునాతన మోర్టార్‌లు, స్థానికంగా తయారు చేసిన రెండు హ్యాండ్ గ్రెనేడ్‌లు, మరో రెండు దేశీయ పిస్టల్‌లను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. కాగా, గత ఏడాదిన్నర కాలంగా మణిపూర్‌లో కుకీ, మైతీ వర్గాల మధ్య ఘర్షణలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఘటనల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోగా మరికొంత మంది నిరాశ్రయులయ్యారు. అయితే గత వారం రోజులుగా ఎటువంటి అల్లర్లు జరగలేదు. ఈ నేపథ్యంలో ఆయుధాలు లభ్యం కావడంతో ఆందోళన నెలకొంది. 


Similar News