Kolkata rape case: కోల్కతా లైంగిక దాడి ఘటన.. ఎస్సీబీఏ తీర్మానంపై వివాదం
కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్పై జరిగిన లైంగిక దాడి, హత్య ఘటనపై సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్(ఎస్సీబీఏ) అధ్యక్షుడు కపిల్ సిబల్ ఓ తీర్మానాన్ని జారీచేసిన విషయం తెలిసిందే.
దిశ, నేషనల్ బ్యూరో: కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్పై జరిగిన లైంగిక దాడి, హత్య ఘటనపై సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్(ఎస్సీబీఏ) అధ్యక్షుడు కపిల్ సిబల్ ఓ తీర్మానాన్ని జారీచేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ప్రస్తుతం వివాదం నెలకొంది. ఎస్సీబీఏ మాజీ అధ్యక్షుడు అదిష్ సీ అగర్వాలా ఈ తీర్మానాన్ని వ్యతిరేకించారు. ఈ మేరకు కపిల్ సిబల్కు ఆదివారం ఓ లేఖ రాశారు. తీర్మానం అనధికారమని, ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆనుమతి లేకుండా ఏకపక్షంగా జారీ చేయడం సరికాదని తెలిపారు. ఇది సమిష్టి నిర్ణయం కంటే కపిల్ వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలియజేస్తుందని పేర్కొన్నారు.
సంబంధిత కేసులో కపిల్ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఆరోపించారు. ఆయన చర్యలు ఎస్సీబీఏ సమగ్రతను దెబ్బతీశాయని, ఈ కేసులో సుప్రీంకోర్టు, సీబీఐ దర్యాప్తును సమర్థవంతంగా ప్రభావితం చేయగలదని స్పష్టం చేశారు. ఈ చర్య న్యాయ వర్గాలను తీవ్రంగా కలచి వేసిందని చెప్పారు. చట్టవిరుద్ధమైన ఈ తీర్మానాన్ని వెంటనే ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే అవిశ్వాస తీర్మానం ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. కాగా, కోల్కతా లైంగిక దాడి ఘటనను ఖండిస్తూ అసోసియేషన్ ఇటీవల ఓ తీర్మానం చేసింది. అయితే తీర్మానంపై కపిల్ సిబల్ సంతకం చేసి, ఎగ్జిక్యూటివ్ కమి ఆమోదించకుండానే ఎస్సీబీఏ లెటర్హెడ్లో ప్రచురించారని ఆరోపించారు.