సరికొత్త యుద్ధనౌకను ప్రారంభించిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము..

సరికొత్త యుద్ధనౌక ‘ఐఎన్‌ఎస్‌ వింధ్యగిరి’ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రారంభించారు.

Update: 2023-08-17 11:33 GMT

కోల్‌కతా : సరికొత్త యుద్ధనౌక ‘ఐఎన్‌ఎస్‌ వింధ్యగిరి’ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్‌ పర్యటనలో భాగంగా కోల్‌కతాలోని హుగ్లీ నది ఒడ్డునున్న గార్డెన్ రీచ్‌ షిప్‌ బిల్డర్స్‌ అండ్ ఇంజినీర్స్‌ లిమిటెడ్‌ను (జీఆర్‌ఎస్‌ఈ) రాష్ట్రపతి సందర్శించారు. ఈ సందర్భంగా అధునాతన స్టెల్త్ యుద్ధ నౌకను నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ‘వింధ్యగిరి’ అనేది కర్ణాటక రాష్ట్రంలోని ఓ పర్వత శ్రేణి పేరు. ‘ప్రాజెక్ట్‌ 17ఎ’లో భాగంగా రూపొందించిన ఆరో యుద్ధనౌక ఇది.

‘ఐఎన్‌ఎస్‌ వింధ్యగిరి’లో సరికొత్త గ్యాడ్జెట్‌లను అమర్చనున్నారు. దీనిని నౌకాదళానికి అప్పగించే ముందు వివిధ రకాలుగా పరీక్షించి చూస్తామని అధికారులు వెల్లడించారు. కాగా.. ‘ప్రాజెక్ట్‌ 17ఎ’లోని నౌకలన్నీ గైడెడ్‌ మిస్సైల్‌ సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఒక్కో నౌక పొడవు 149 మీటర్లు ఉంటుంది. అధునాతన ఆయుధాలు, సెన్సార్లు, ప్లాట్‌ఫామ్‌ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లు వీటిలో పొందుపరిచారు.


Similar News