PM Modi : సైన్సు, హిస్టరీ కలిస్తే.. భారత వారసత్వ సంపద : ప్రధాని మోడీ

దిశ, నేషనల్ బ్యూరో : యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సెంటర్‌కు భారత్ తరఫున రూ.8.50 కోట్ల విరాళాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించారు.

Update: 2024-07-21 18:57 GMT

దిశ, నేషనల్ బ్యూరో : యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సెంటర్‌కు భారత్ తరఫున రూ.8.50 కోట్ల విరాళాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించారు. గ్లోబల్ సౌత్ దేశాలలోని ప్రాచీన వారసత్వ సంపద పరిరక్షణకు ఈ నిధులను వినియోగించాలని యునెస్కోను ఆయన కోరారు. ఆదివారం న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ‘వరల్డ్ హెరిటేజ్ కమిటీ’ 46వ సెషన్‌ను ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత్‌లోని ప్రతీ చోటుకు ప్రాచీన చరిత్ర ఉందన్నారు. చరిత్రతో సైన్సు మేళవింపును భారత వారసత్వ సంపదలో స్పష్టంగా చూడొచ్చని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలోని కుతుబ్ మినార్ కాంప్లెక్సులో ఉన్న ‘ఐరన్ పిల్లర్’ గత 2000 సంవత్సరాలుగా ఆరుబయటే ఉన్న తుప్పుపట్టకుండా సేఫ్‌గా ఉందని మోడీ గుర్తు చేశారు.

దీన్నిబట్టి అప్పట్లోనే భారతీయులు లోహాల తయారీలో ఎలాంటి టెక్నాలజీని వాడేవాళ్లో మనం అర్థం చేసుకోవచ్చన్నారు. కంబోడియాలోని ఆంగ్కోర్ వాట్ దేవాలయం, వియత్నాంలోని చామ్ దేవాలయాలు, మయన్మార్‌లోని బగాన్ స్థూపం పరిరక్షణ కోసం భారత్ ఇప్పటికే సహాయ సహకారాలను అందిస్తోందని ప్రధాని తెలిపారు. గత పదేళ్లలో ‘అయోధ్య’ రామమందిరం, ‘కాశీ’ విశ్వనాథ్ కారిడార్, పురాతన ‘నలందా’ వర్సిటీకి ఆధునిక క్యాంపస్‌ను అందుబాటులోకి తెచ్చి ప్రాచీన వారసత్వ సంపదకు జీవంపోశామని మోడీ చెప్పారు.

Tags:    

Similar News