లక్నో : వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లో "ఇండియా" కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ విశ్వాసం వ్యక్తం చేశారు. జయంత్ చౌదరికి చెందిన రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ) పార్టీతో తమ పొత్తు చెక్కుచెదరలేదని స్పష్టం చేశారు. వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనారిటీల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలపై దృష్టిపెట్టామని, మొత్తం 80 సీట్లు "ఇండియా"నే గెల్చుకుంటుందని తేల్చి చెప్పారు. గురువారం బాండా టౌన్లో సమాజ్వాదీ పార్టీ కార్యకర్తల సమావేశంలో అఖిలేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో యోగి సర్కారు విఫలమైనందున ప్రజలు ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు.