IMA protest: రేపు దేశ వ్యాప్తంగా వైద్య సేవలు బంద్.. ఐఎంఏ కీలక నిర్ణయం

కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ట్రైనీ మహిళా డాక్టర్‌పై అత్యాచారం, హత్యకు నిరసనగా శనివారం ఉదయం 6 గంటల నుంచి దేశవ్యాప్తంగా 24 గంటల పాటు అన్ని వైద్య సేవలను నిలిపివేస్తున్నట్టు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ప్రకటించింది.

Update: 2024-08-16 12:10 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ట్రైనీ మహిళా డాక్టర్‌పై అత్యాచారం, హత్యకు నిరసనగా శనివారం ఉదయం 6 గంటల నుంచి దేశవ్యాప్తంగా 24 గంటల పాటు అన్ని వైద్య సేవలను నిలిపివేస్తున్నట్టు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు ఆర్ వీ అశోకన్, ప్రధాన కార్యదర్శి అశోక్ జే నాయక్‌లు ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే అత్యవసరమైన సేవలు నిర్వహిస్తామని, క్యాజువాలిటీ వార్డులు సైతం పనిచేస్తాయని పేర్కొన్నారు. ఔట్ పేషెంట్ సేవలు పనిచేయవని, ఎలక్టివ్ సర్జరీలు సైతం నిలిపివేస్తామని తెలిపారు. ఐఎంఏ రాష్ట్ర శాఖలతో సమావేశం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఆధునిక వైద్యులు సేవలు అందిస్తున్న అన్ని రంగాల్లోనూ సేవల ఉపసంహరణ ఉంటుందని తెలిపారు. లైంగిక దాడి ఆరోపణల తర్వాత ఆగస్టు 9 నుంచి జరిగిన విధ్వంసాన్ని ఐఎంఏ ఖండించింది. కాగా, ట్రైనీ డాక్టర్ హత్య కేసులో నిందితులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Tags:    

Similar News