జల విలయాన్ని ‘రాష్ట్ర విపత్తు’గా ప్రకటించిన హిమాచల్ సర్కారు..
వర్షాలు, వరదలు సృష్టిస్తున్న జల విలయాన్ని హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రెస్ ప్రభుత్వం ‘రాష్ట్ర విపత్తు’గా ప్రకటించింది.
సిమ్లా : వర్షాలు, వరదలు సృష్టిస్తున్న జల విలయాన్ని హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రెస్ ప్రభుత్వం ‘రాష్ట్ర విపత్తు’గా ప్రకటించింది. అందుకు సంబంధించిన నోటిఫికేషన్ను సీఎం సుఖ్వీందర్ సుఖు విడుదల చేశారు. కేంద్ర సర్కారు స్పందించి దీన్ని ‘జాతీయ విపత్తు’గా ప్రకటించాలని కోరింది. జోరువానల కారణంగా సిమ్లా సహా పలు జిల్లాల్లో కొండ చరియలు విరిగిపడి భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందని సీఎం సుఖ్వీందర్ సుఖు శుక్రవారం వెల్లడించారు. వరదల కారణంగా ఇళ్లు కోల్పోయిన వారికి కావాల్సిన సాయం అందజేస్తున్నామన్నారు. కేంద్ర బృందాలు రాష్ట్రంలో పర్యటించి నష్టాన్ని అంచనా వేశాయని పేర్కొన్నారు.
తక్షణమే ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం సాయం అందించాలని కోరారు. ఈ వరదల కారణంగా రాష్ట్రానికి రూ.10వేల కోట్లు నష్టం వాటిల్లిందని తెలిపారు. ఇక రాష్ట్రంలో వర్షాల కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 75కు పెరిగింది. ఒక్క సిమ్లాలోనే మూడుచోట్ల కొండ చరియలు విరిగిపడటంతో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు హిమాచల్ ప్రదేశ్ లో 217 మంది ప్రాణాలు కోల్పోయారు. 11,301 ఇళ్లు పాక్షికంగా, పూర్తిగా ధ్వంసమయ్యాయి.