నీట్ పేపర్ లీకేజీ కేసులో నిందితులకు రిమాండ్ విధించిన సీబీఐ కోర్టు

Half-Shut Windows, Abandoned Scooters: Scene At NEET Leak Accuseds Home

Update: 2024-06-26 14:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్‌ పేపర్‌ లీకేజీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేయగా, కేంద్రం ఆదేశాలతో సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తును వేగంగా కొనసాగిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో మొత్తం 18 మంది నిందితులను సీబీఐ అదుపులోకి తీసుకుంది. అందులో పాట్నాకు చెందిన 13 మంది ఉండగా, జార్ఖండ్‌కు చెందిన ఐదుగురు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. అయితే, 13 మంది నిందితుల బెయిల్ పిటిషన్లను పాట్నా కోర్టు మంగళవారం విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్లను విచారించిన పాట్నా సివిల్ కోర్టు అదనపు జిల్లా జడ్జి రాజేంద్ర కుమార్ సింగ్.. కేసును సెంట్రల్ ఏజెన్సీ దర్యాప్తు చేస్తున్నందున ప్రత్యేక సీబీఐ కోర్టు నుంచి బెయిల్ పొందాలని నిందితులకు సూచించారు. పరారీలో ఉన్న కీలక నిందితుల్లో ఒకరైన సంజీవ్ ముఖియా కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. 13 మంది నిందితుల బెయిల్ పిటిషన్, ప్రధాన నిందితుడు సంజీవ్ ముఖియా ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జూలై 15న సీబీఐ ప్రత్యేక కోర్టులో జరుగుతుందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉదయ్ శంకర్ సింగ్ తెలిపారు. తాజాగా, కేసులో కీలక నిందితులైన బల్‌దేవ్ కుమార్ అలియాస్ చింటు, ముకేష్‌ కుమార్‌లకు సీబీఐ ప్రత్యేక కోర్టులో హజరుపరచగా.. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు వారికి రిమాండ్ విధించింది.



Similar News