Kashmiri Pandits : కశ్మీరీ పండిట్లూ.. కశ్మీరుకు తిరిగొచ్చేయండి : ఫరూఖ్ అబ్దుల్లా

దిశ, నేషనల్ బ్యూరో : జమ్మూకశ్మీరులో నేషనల్ కాన్ఫరెన్స్ - కాంగ్రెస్ సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది.

Update: 2024-10-12 15:11 GMT

దిశ, నేషనల్ బ్యూరో : జమ్మూకశ్మీరులో నేషనల్ కాన్ఫరెన్స్ - కాంగ్రెస్ సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ తరుణంలో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ చీఫ్ ఫరూఖ్ అబ్దుల్లా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉంటున్న కశ్మీరీ పండిట్లకు కీలక సందేశాన్ని విడుదల చేశారు. కశ్మీరీ పండిట్లు అందరూ వారి స్వస్థలం కశ్మీరుకు తిరిగి వచ్చేయాలని ఆయన కోరారు. తప్పకుండా వారంతా కశ్మీరుకు తిరిగొస్తారని ఫరూఖ్ అబ్దుల్లా ఆశాభావం వ్యక్తం చేశారు.

తమ ప్రభుత్వం కశ్మీరుకే పరిమితం కాకుండా.. జమ్మూ ప్రజల బాగోగుల గురించి కూడా తప్పకుండా ఆలోచిస్తుందన్నారు. ‘‘మా సర్కారు హిందూ, ముస్లింలను వేర్వేరుగా చూడదు. భారతీయులు అందరికీ కశ్మీరులో చోటు ఉండి తీరుతుంది’’ అని ఆయన స్పష్టం చేశారు. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ కశ్మీరీ పండిట్లకు శత్రువు కానే కాదని తేల్చి చెప్పారు. కశ్మీరీ పండిట్లు తిరిగొస్తే కంటికి రెప్పలా కాపాడుకునేందుకు తాము సిద్ధమన్నారు.


Similar News