DhankhaD: జనాభా పెరుగుదల ఆందోళనకరం.. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్

దేశంలో జనాభా పెరుగుదలపై ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఆందోళన వ్యక్తం చేశారు. అధిక జనాభా అణుబాంబు తీవ్రత కంటే తక్కువేం కాదని తెలిపారు.

Update: 2024-10-15 10:16 GMT

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో జనాభా పెరుగుదలపై ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఆందోళన వ్యక్తం చేశారు. అధిక జనాభా అణుబాంబు తీవ్రత కంటే తక్కువేం కాదని తెలిపారు. జైపూర్‌లోని బిర్లా ఆడిటోరియంలో మంగళవారం జరిగిన సీఏ కాన్ఫరెన్స్ సెషన్‌లో ఆయన ప్రసంగించారు. జనాభా పెరుగుదల కొన్ని ప్రాంతాలను రాజకీయ కోటలుగా మారుస్తోందని, అక్కడ ఎన్నికలకు అర్ధం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యూహాత్మక మార్పుల వల్ల ప్రజాస్వామ్య సారాంశం కోల్పోయి కంచుకోటలుగా మారడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఈ సమస్య భారతదేశ భవిష్యత్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. శాంతి, సామరస్యాన్ని దెబ్బతీసే ప్రమాదం పొంది ఉందన్నారు. సేంద్రీయ, సహజ జనాభా మార్పు ఎప్పుడూ సమస్య కాదని స్పష్టం చేశారు. అయితే కొంత లక్ష్యాన్ని సాధించేందుకు వ్యూహాత్మకంగా చేపట్టే జనాభా మార్పు చాలా ప్రమాదకరమని తెలిపారు.

గత కొన్ని దశాబ్దాలుగా ఈ జనాభా మార్పును విశ్లేషించడం వల్ల నాగరికత, ప్రజాస్వామ్యానికి సవాల్ విసిరిన సందర్భాలూ అనేకం ఉన్నాయని గుర్తు చేశారు. ఈ సమస్యను సరిగ్గా పరిష్కరించకపోతే దేశ అస్తిత్వానికే ముప్పుగా మారుతుందని హెచ్చరించారు. దేశ సాంస్కృతిక వారసత్వాన్ని బలహీనంగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని, అటువంటి శక్తులను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. భారత్ అభివృద్ధి ప్రయాణం ప్రపంచ దేశాలను ఆశ్చర్య పరుస్తోందని, అయితే సామాజిక ఐక్యతకు భంగం కలిగితే అభివృద్ధి ఆగిపోతుందని తెలిపారు.


Similar News