ఇంత దుర్మార్గమా...రెండు ప్రాణాలు తీసిన ఆటో గ్యాంగ్
సమాజంలో పెరిపోతున్న నేర ప్రవృత్తి..నశిస్తున్న మానవత్వానికి నిదర్శనంగా నిలిచింది ముంబైలో జరిగిన ఈ దారుణ ఘటన.
దిశ, వెబ్ డెస్క్ : సమాజంలో పెరిపోతున్న నేర ప్రవృత్తి..నశిస్తున్న మానవత్వానికి నిదర్శనంగా నిలిచింది ముంబైలో జరిగిన ఈ దారుణ ఘటన. కేవలం ఆటోకు హారన్ కొట్టినందుకు కుటుంబంపై దాడి చేసి రెండు నిండు ప్రాణాలు తీసిన ఆటో గ్యాంగ్ దుర్మార్గ చర్య సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముంబైకి చెందిన ఆకాష్ మీన్ అనే వ్యక్తి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు.. అతని భార్య గర్భిణి. ఆకాష్ మీన్ తన తల్లిదండ్రులకు కారు గిప్ట్గా ఇద్దామని ముంబైకి వెళ్ళాడు. కారు డెలివరీ ఆలస్యం కావడంతో షోరూం నుంచి ఆకాష్, గర్భిణీ అయిన తన భార్య బైక్పై ఇంటికి తిరిగి ప్రయాణం కాగా, ఆకాష్ తల్లిదండ్రులు ఆటోలో బయలుదేరారు. దారిలో ఆకాష్ బైక్ ముందు ఒక ఆటో వ్యక్తి స్పీడ్గా కట్ కొట్టగా, ఆకాష్, అతని భార్య కిందపడబోయారు. దీంతో ఆకాష్ బైక్ హారన్ కొట్టి ఆటో నడిపే వ్యక్తిని జాగ్రత్తగా నడపాలని మందలించాడు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా, ఆటో డ్రైవర్ తన స్నేహితులకు ఫోన్ చేయగా 15 మంది వచ్చి ఆకాష్పై విచక్షణారహితంగా దాడి చేశారు.
ఆకాష్ను కాపాడుకోవడానికి అడ్డం వెళ్లిన భార్య, తల్లిదండ్రులపై విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో ఆకాష్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆకాష్ భార్య గర్భిణిపై కూడా ఆటో గ్యాంగ్ దాడి చేయడంతో ఆమె కడుపులోని చిన్నారి చనిపోయింది. దాడిలో ఆకాష్ తండ్రికి కన్ను పోగా, తల్లికి తీవ్రగాయాలయ్యాయి. చిన్న వాగ్వాదం చిలికి చిలికి పెద్దదై రెండు ప్రాణాలు పోయి ఆ కుటుంబం సర్వం కోల్పోయింది. ఈ తరహా ఘటనలు నిత్యం రోడ్లపై చోటుచేసుకుంటున్న తీరు ఆందోళన కరంగా మారింది. ఆటో గ్యాంగ్ ల, మూక దాడుల సందర్భాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించాలని నెటిజన్లు సూచిస్తున్నారు.