Engineer Rashid: ఇంజనీర్ రషీద్కు బిగ్ రిలీఫ్.. మధ్యంత బెయిల్ మరోసారి పొడిగింపు
బారాముల్లా ఎంపీ ఇంజనీర్ రషీద్కు మరోసారి ఊరట లభించింది. మధ్యంతర బెయిల్ను పాటియాలా హౌస్ కోర్టు పొడిగించింది.
దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్లోని బారాముల్లా ఎంపీ ఇంజనీర్ రషీద్కు మరోసారి ఊరట లభించింది. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో ఆయనకు మంజూరైన మధ్యంతర బెయిల్ను పాటియాలా హౌస్ కోర్టు మంగళవారం అక్టోబర్ 28 వరకు పొడిగించింది. రషీద్ తండ్రికి సంబంధించిన అనారోగ్య కారణాల దృష్యా కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. అనంతరం ఈ నెల 28 మధ్యాహ్నం 12 గంటలలోపు రషీద్ జైలు అధికారుల ఎదుట లొంగిపోవాలని అదనపు సెషన్స్ జడ్జి చందర్ జిత్ సింగ్ ఆదేశించారు. ఆయన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై తీర్పును సైతం అదే తేదీకి వాయిదా వేశారు.
కాగా, టెర్రర్ ఫండింగ్ కార్యకలాపాలపై దర్యాప్తులో భాగంగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) రషీద్ను అరెస్ట్ చేయగా 2019 నుంచి ఆయన తీహార్ జైలులో ఉన్నారు. ఈ క్రమంలోనే జైలు నుంచే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. అయితే జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు గాను రషీద్కు సెప్టెంబర్ 10న బెయిల్ మంజూరు చేశారు. అక్టోబర్ 2న ఆయన బెయిల్ గడువు ముగియగా దానిని 15 వరకు పొడిగించారు. ఈ నేపథ్యంలోనే మరోసారి 28 వరకు పెంచారు.