Tamil Nadu Governor: సెక్యులరిజం యూరప్ భావన.. తమిళనాడు గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యలు

తమిళనాడు గవర్నర్ మరోసారి వార్తల్లో నిలిచారు.‘‘లౌకికవాదం(Secularism)’’ పై గవర్నర్ చేసిన వ్యాఖ్యలతో రాజకీయ దుమారం రేగింది.

Update: 2024-09-24 10:12 GMT

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడు గవర్నర్ మరోసారి వార్తల్లో నిలిచారు.‘‘లౌకికవాదం(Secularism)’’ పై గవర్నర్ చేసిన వ్యాఖ్యలతో రాజకీయ దుమారం రేగింది. ‘‘సెక్యులరిజం అనేది యూరప్ భావన, భారతదేశంలో దానికి స్థానం లేదు’’ అని ’’ అని కన్యాకుమారిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన వ్యాఖ్యానించారు. ‘‘ దేశ ప్రజలను చాలా రకాలుగా మోసం చేశారు. అందులో ఒకటి లౌకికవాదం. దీనికి తప్పుడు వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించారు. సెక్యులరిజం అంటే ఏమిటి..? అదో యూరోపియన్ భావన. ఇది భారతీయ భావన కాదు.’’ అని కన్యాకుమారిలో జరిగిన ఓ బహిరంగ కార్యక్రమంలో రవి అన్నారు. చర్చి, రాజు మధ్య పోరాటం ఫలితంగా యూరప్ కి లౌకికవాదం వచ్చిందన్నారు. భారతదేశం ధర్మానికి ఎలా దూరంగా ఉంటుంది..? అని ప్రశ్నించారు. దేశానికి సెక్యులరిజం అవసరం లేదన్నారు. ఇకపోతే, 1976లో 42వ సవరణ ద్వారా భారత రాజ్యాంగ ప్రవేశికలో “సెక్యులర్” అనే పదాన్ని చేర్చారు.

గవర్నర్ పై విమర్శలు

అయితే, గవర్నర్ వ్యాఖ్యలను పలు రాజకీయ పార్టీలు తప్పుబట్టాయి. అసలు రాజ్యాంగం అనేదే విదేశీ భావని అని భవిష్యత్ లో చెప్పవచ్చన్నాయి. సీపీఎం నేత బృందా కారత్ మాట్లాడుతూ.. లౌకికవాదం లేదా రాజకీయాల నుంచి మతాన్ని వేరు చేయడం భారత రాజ్యాంగంలో కీలకమని అన్నారు. ఇదంతా ఆర్ఎస్ఎస్ భావన అని, అలాంటి గవర్నర్‌ని నియమించడం సిగ్గు చేటన్నారు. సీపీఐ నాయకుడు డి రాజా గవర్నర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆయన భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ “ధర్మపరిపాలన భావనను” తిరస్కరించారని విమర్శించారు. ఫెడరలిజం, ఒక వ్యక్తి ఒకే ఓటు, ప్రజాస్వామ్యం - ఇవన్నీ యూరప్‌ నుంచే పుట్టాయన కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం అన్నారు. సెక్యులరిజం అనేది భారతదేశానికి అత్యంత అవసరమైన భావన అని డీఎంకే అధికార ప్రతినిధి టీకేఎస్ ఇలంగోవన్ గుర్తుచేశారు. గవర్నర్ ఓసారి పూర్తిగా రాజ్యాంగాన్ని చదవాలని ఎద్దేవా చేశారు.


Similar News