Land-for-jobs case: లాలూ ప్రసాద్, తేజస్వి యాదవ్ కు ఢిల్లీ కోర్టు సమన్లు

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు తేజస్వి యాదవ్ లకు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది.

Update: 2024-09-18 07:13 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు తేజస్వి యాదవ్ లకు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. భూములు తీసుకుని రైల్వే ఉద్యోగాలు కట్టబెట్టారన్న ఈడీ కేసులో ఈ పరిణామం జరిగింది. లాలూ ప్రసాద్ కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఈడీకేసు నమోదు చేసింది. అందులో భాగంగానే ఢిల్లీకోర్టు నోటీసులు ఇచ్చింది. అక్టోబర్ 7న కోర్టు ముందు హాజరు కావాలని ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే నిందితులను ఆదేశించారు. ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి ఈ ఆదేశాలు జారీ చేశారు. తుది నివేదికను ఈడీ ఆగస్టు 6న కోర్టుకు సమర్పించింది. సీబీఐ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగానే ఈడీ దర్యాప్తు చేస్తోంది.

అసలు కేసేంటంటే?

ఇకపోతే, జూన్‌లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) అధికారులు లాలూ ప్రసాద్ యాదవ్‌తో పాటు 38 మంది అభ్యర్థులతో సహా 77 మందిపై ఛార్జిషీటు దాఖలు చేశారు. లాలూ ప్రసాద్ యాదవ్ 2004 నుండి 2009 వరకు కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ఆర్థిక ప్రయోజనాలకు బదులుగా వివిధ రైల్వే జోన్‌లలోని గ్రూప్ “డి” ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించింది. లాలూప్రసాద్ కుటుంబ సభ్యులకు ఈ ప్రయోజనాలన్నీ భూ బదలాయింపుల రూపంలో వచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. ఉద్యోగాలు పొందిన వారు లేదా వారి కుటుంబాలు, పాట్నా నివాసితులు తమ భూమిని లాలూ కుటుంబం లేదా అతని బంధువుల నియంత్రణలో ఉన్న కంపెనీకి విక్రయించారని తెలిపింది. దీంతో, ఆస్తుల బదిలీ సులభతరం అయ్యిందని సీబీఐ వెల్లడించింది.


Similar News