తిరిగి జైలుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్
మద్యం పాలసీకి సంబంధించిన అవినీతి కేసులో మధ్యంతర బెయిల్ మీద బయట ఉన్నటువంటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ ముగియడంతో తిరిగి జైలుకు బయలుదేరారు.
దిశ, నేషనల్ బ్యూరో: మద్యం పాలసీకి సంబంధించిన అవినీతి కేసులో మధ్యంతర బెయిల్ మీద బయట ఉన్నటువంటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ ముగియడంతో తిరిగి జైలుకు బయలుదేరారు. మధ్యాహ్నం 3 గంటలకు తన నివాసం నుండి బయలుదేరి రాజ్ఘాట్ను సందర్శించి మహాత్మా గాంధీకి నివాళులర్పించి, కన్నాట్ ప్లేస్లోని హనుమాన్ ఆలయాన్ని సందర్శించి హనుమంతుడికి పూజలు చేసి, ఆ తర్వాత అక్కడి నుంచి పార్టీ కార్యాలయానికి వెళ్లి కార్యకర్తలు, పార్టీ నేతలందరినీ కలిసి నేరుగా తీహార్ జైలుకు వెళ్లనున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది, అయితే చివరి దశ పోలింగ్ ముగిసిన ఒక రోజు తర్వాత లొంగిపోవాలని కోర్టు ఆదేశించగా. దీంతో ఆయన తిరిగి తీహార్ జైలుకు వెళ్తున్నారు.
ఆయన ఇప్పటికే ఢిల్లీ కోర్టులో రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు, అయితే పిటిషన్ జూన్ 5 న విచారణకు రానుంది. మే 10 నుంచి జూన్ 1 వరకు దాదాపు 21 రోజుల పాటు కేజ్రీవాల్ జైలు బయట ఉన్నారు. ఈ సందర్బంగా ఢిల్లీ మంత్రి అతిషి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు 21 రోజుల మధ్యంతర బెయిల్ ఇచ్చినందుకు సుప్రీంకోర్టుకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఆయన బయటకు వచ్చి ఎన్నికల కోసం ప్రచారం చేసి ప్రజాస్వామ్య ప్రక్రియకు దోహదపడ్డారు. మేము సుప్రీంకోర్టును గౌరవిస్తాము. ఆప్ నాయకుడు ఎవరు భయపడరని అన్నారు.