రక్షణ శాఖ బలోపేతానికి రూ. 7,800 కోట్లు..
రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని ‘రక్షణ ఉత్పత్తుల సేకరణ మండలి (డీఏసీ)’.. సుమారు రూ. 7,800 కోట్ల విలువైన ప్రతిపాదనలకు అంగీకారం తెలిపింది.
న్యూఢిల్లీ: రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని ‘రక్షణ ఉత్పత్తుల సేకరణ మండలి (డీఏసీ)’.. సుమారు రూ. 7,800 కోట్ల విలువైన ప్రతిపాదనలకు అంగీకారం తెలిపింది. దీంతో భారత సాయుధ దళాల కార్యాచరణ సామర్థ్యాలను పెంపొందించనున్నట్లు మంత్రిత్వ శాఖ గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. భారత వైమానిక దళ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు Mi-17 V5 హెలికాప్టర్లపై ‘ఎలక్ట్రానిక్ వార్ఫేర్ (EW) సూట్’ కొనుగోలు, ఇన్స్టాలేషన్కు గాను డీఏసీ.. అవసరమైన అనుమతిని (AoN) మంజూరు చేసినట్లు వెల్లడించింది.
మెకనైజ్డ్ పదాతిదళం, సాయుధ రెజిమెంట్ల కోసం భూమి-ఆధారిత స్వయంప్రతిపత్త వ్యవస్థలు.. మానవరహిత నిఘా, మందుగుండు సామగ్రి, ఇంధనం & విడిభాగాల లాజిస్టిక్ డెలివరీ, యుద్ధభూమిలో ప్రమాదాల తరలింపు వంటి వివిధ కార్యకలాపాలను ప్రారంభిస్తాయని చెప్పింది. ‘ప్రాజెక్ట్ శక్తి’ కింద సైన్యం కోసం అత్యంత మన్నికైన ల్యాప్టాప్లు, టాబ్లెట్ల సేకరణ కోసం కూడా ఆమోదం లభించింది. కాగా.. ఇవన్నీ స్వదేశీ విక్రేతల నుంచే కొనుగోలు చేయనున్నట్లు మంత్రిత్వ శాఖ ప్రకటించింది.