
దిశ, వెబ్డెస్క్ : ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ను ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. మహమ్మారి కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా బ్రెజిల్ శాస్త్రవేత్తలు గబ్బిలాల్లో ఓ కొత్త రకం కరోనా వైరస్ని గుర్తించడం ఆందోళన కలిగిస్తోంది. ఇది ప్రాణాంతకమైన కరోనా మెర్స్ వేరియంట్తో జన్యుపరమైన పోలికలను కలిగి ఉన్నట్టు గుర్తించారు. ఈ వైరస్ మెర్స్ కోవిడ్ వేరియంట్కు 72శాతం దగ్గరి పోలికలను కలిగి ఉందని సమాచారం. బ్రెజిల్ శాస్త్రవేత్తలు, హాంకాంగ్లోని ఓ యూనివర్సిటీ బృందంతో కలిసి ఈశాన్య బ్రెజిల్ నుండి వచ్చిన గబ్బిలాల్లో ఈ వైరస్ను గుర్తించారు.
అయితే మానవులకు ఇది సోకుతుందా లేదా అనేది ఇంకా నిర్దారించలేదు. ప్రస్తుతం హై బయోసెక్యురిటీ ల్యాబ్లలో ఇది మానవులకు సోకుతుందా లేదా అనేదానిపై ప్రయోగాలు జరుగుతున్నాయి. సాధారణంగా గబ్బిలాలకు వచ్చే వైరస్ల వల్ల మానవులకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. కాబట్టి వాటిపై నిరంతర పర్యవేక్షణ అవసరమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
తరచూ పరిశోధనలు చేయడం ద్వారా కరోనా వైరస్ల జన్యు వైవిధ్యాన్ని, భవిష్యత్లో ప్రాణాంతక వైరస్లు మానవులకు సోకకుండా ఉండేందుకు ప్రయోగాలు కచ్చితంగా అవసరం అని నిపుణులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా కరోనా వైరస్ మానవులకు గబ్బిలాల నుండే సోకిన సంగతి తెలిసిందే. చైనాలోని వూహాన్ నగరంలో గబ్బిలాల నుండి ఈ వైరస్ మానవులకు వ్యాపించిందని పలు పరిశోధనలు చెబుతున్నారు. మొదట చైనాలోనే పురుడు పోసుకున్నప్పటికీ ఆ తరవాత ఇతర దేశాలకు సైతం కరోనా వ్యాప్తిం చెందింది. ప్రపంచంలోని పలు దేశాలలో లాక్ డౌన్ విధించే పరిస్థితి వచ్చింది. భవిష్యత్లో ఇలాంటి వైరస్లు రాకుండా ఉండాలంటే ముందుగానే జాగ్రత్త పడటం మంచిదే.