IC 814 Kandahar Hijack: వెబ్‌ సిరీస్‌ వివాదం.. కంటెంట్‌పై సమీక్ష!

వివాదాస్పద వెబ్ సిరీస్ కాందహార్‌ హైజాక్‌ కంటెంట్ ని సమీక్షించాలని నెట్ ఫ్లిక్స్ నిర్ణయం తీసుకుంది.

Update: 2024-09-03 07:41 GMT

దిశ, నేషనల్ బ్యూరో: వివాదాస్పద వెబ్ సిరీస్ కాందహార్‌ హైజాక్‌ కంటెంట్ ని సమీక్షించాలని నెట్ ఫ్లిక్స్ నిర్ణయం తీసుకుంది. ఈనేపథ్యంలోనే సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ అధికారులతో నెట్‌ఫ్లిక్స్‌ ఇండియా విభాగ సారథి భేటీ అయినట్లు తెలుస్తోంది. దేశ ప్రజల మనోభావాలకు అనుగుణంగా కంటెంట్‌ ఉంటుందని కేంద్రానికి చెప్పినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఓ వర్గం నుంచి వస్తున్న ఆందోళన నేపథ్యంలో కేంద్రం కూడా నెట్‌ఫ్లిక్స్‌కి సమన్లు జారీ చేసింది.

వివాదంగా మారిన వెబ్ సిరీస్

1999లో ఖాట్మాండు-న్యూ ఢిల్లీకి వస్తున్న ఇండియన్ ఎయిర్‌లైన్ విమానం ఐసీ 814ని హైజాక్ చేసి ఆఫ్ఘనిస్తాన్ కాందహార్ తీసుకెళ్లారు. పాకిస్థాన్ హర్కత్ ఉల్ ముజాహిదీన్‌కి చెందిన ఐదుగురు ఇస్లామిక్ ఉగ్రవాదులు ఈ హైజాక్‌కి పాల్పడ్డారు. భారతీయుల్ని విడిపించేందుకు అప్పటి అటల్ బిహారీ వాజ్‌పేయ ప్రభుత్వం జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ చీఫ్ మౌలానా మసూద్ అజార్‌తో సహా ముగ్గురు ఉగ్రవాదుల్ని విడుదల చేసింది. ఈ నేపథ్యం ఆధారంగా నెట్‌ఫ్లిక్ సిరీస్‘‘’IC 814 కాందహార్ హైజాక్’’ ని రూపొందించింది. అయితే, ఈ వెబ్ సిరీస్ వివాదాస్పదమైంది. ఐదుగురు హైజాకర్లలో ఇద్దరికి హిందూ పేర్లు అయిన భోలా, శంకర్‌గా పిలువడంపై పలువురు అభ్యంతరం చెప్పారు. అనుభవ్ సిన్హా దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ఆగష్టు 29న విడుదలైంది. ఈ సిరీస్ పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు, ఈ సిరీస్ బ్యాన్ చేయాలని ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైంది.


Similar News