మెర్సిడేజ్ హిట్ అండ్ రన్ కేసు.. బాధిత కుటుంబానికి రూ.1.98కోట్లు చెల్లించాలని ఆదేశం
ఢిల్లీలో 2016లో జరిగిన మెర్సిడేజ్ హిట్ అండ్ రన్ కేసులో బీమా కంపెనీకి మోటారు యాక్సిడెంట్ ట్రైబ్యూనల్ ఆదేశాలు జారీ చేసింది.
దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీలో 2016లో జరిగిన మెర్సిడేజ్ హిట్ అండ్ రన్ కేసులో బీమా కంపెనీకి మోటారు యాక్సిడెంట్ ట్రైబ్యూనల్ ఆదేశాలు జారీ చేసింది. బాధిత కుటుంబసభ్యులకు రూ.1.98 కోట్ల నష్టపరిహారాన్ని ఇవ్వాలని ఆదేశించింది. 30 రోజుల్లోగా బాధితుడి తల్లిదండ్రులకు రూ.1.21 కోట్ల పరిహారం, రూ.77.61 లక్షల వడ్డీతో సహా రూ.1.98 కోట్లు చెల్లించాలని పేర్కొంది. అయితే, కారు రిజిస్టర్ అయిన మైనర్ తండ్రి నుంచి ఆ మొత్తాన్ని రికవరీ చేసుకునే స్వేచ్ఛ కంపెనీకి ఉందని వెల్లడించింది. జనవరి 2015లో బాధితుడు నెలవారీ జీతం రూ.25 వేలు తీసుకుంటున్నారనే విషయాన్ని పరిగణలోకి తీసుకున్నట్లు ట్రైబ్యునల్ పేర్కొంది.
మెర్సిడేస్ హిట్ అండ్ రన్ కేసు
ఢిల్లీలోని సివిల్ లైన్స్లో 2016, ఏప్రిల్ 4వ తేదీన యాక్సిడెంట్ జరిగింది. ఓ మైనర్ మెర్సిడేజ్ కారును డ్రైవ్ చేశాడు. మెర్సిడేజ్ ఢీకొన్న ఘటనలో 32 ఏళ్ల సిద్ధార్థ శర్మ ప్రాణాలు కోల్పోయాడు. ఆ ఏరియాలో ఇన్స్టాల్ చేసిన సెక్యూర్టీ కెమెరాకు ఆ యాక్సిడెంట్ చిక్కింది. మైనర్ కుమారుడిని అడ్డుకోవడంలో తండ్రి విఫలమైనట్లు కూడా ట్రిబ్యునల్ పేర్కొన్నది. ప్రమాదం జరిగిన సమయంలో కారు చాలా వేగంతో ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. కారు ఢీకొన్న సమయంలో సిద్ధార్థ సుమారు 20 ఫీట్ల ఎత్తుకు ఎగిరిపడినట్లు రిపోర్టులో పేర్కొన్నారు.