బ్రేకింగ్ : నీట్ - యూజీ పేపర్ లీక్ మాస్టర్ మైండ్ రాకీ అరెస్ట్

దిశ, నేషనల్ బ్యూరో : నీట్-యూజీ ప్రశ్నాపత్రం లీక్ కేసులో కీలక సూత్రధారిని సీబీఐ గురువారం అరెస్టు చేసింది.

Update: 2024-07-11 13:05 GMT

దిశ, నేషనల్ బ్యూరో : నీట్-యూజీ ప్రశ్నాపత్రం లీక్ కేసులో కీలక సూత్రధారిని సీబీఐ గురువారం అరెస్టు చేసింది. బిహార్‌లోని నలందకు చెందిన రాకీ అలియాస్ రాకేష్ రంజన్‌ను పాట్నా నగర శివార్లలో అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న సంజీవ్ ముఖియా బంధువే ఈ రాకేష్ రంజన్‌ అని గుర్తించారు. అరెస్టు చేసిన వెంటనే అతడిని పాట్నాలోని ప్రత్యేక కోర్టు ఎదుట హాజరుపర్చగా, 10 రోజుల సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఈ వారం ప్రారంభంలో బిహార్, జార్ఖండ్‌, బెంగాల్‌లోని పలుచోట్ల సోదాలు నిర్వహించిన సీబీఐ పలు కీలక సాక్ష్యాలను సేకరించింది. వాటి ఆధారంగానే రాకీని అరెస్టు చేసినట్లు తెలిసింది. ఈ కేసులో ఇప్పటివరకు సీబీఐ ఆరు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది. బిహార్‌లో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ పేపర్ లీక్‌లకు సంబంధించినది. గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్రలలో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లు అభ్యర్థులను మోసగించడంతో ముడిపడి ఉన్నవి.


Similar News