వరదల్లో కోల్కత్తా... నీళ్ళల్లో విమానాలు
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కత్తా నగరాన్ని భారీ వరదలు ముంచెత్తాయి.
దిశ, వెబ్ డెస్క్ : పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కత్తా నగరాన్ని భారీ వరదలు ముంచెత్తాయి. గతకొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పశ్చిమ బెంగాల్ వరద గుప్పిట్లో చిక్కుకుంది. రాష్ట్రంలోని ప్రధాన నగరాలన్నీ జలమయం అయ్యాయి. ఆ రాష్ట్ర రాజధాని కోల్కత్తాలో ఇండ్లు, రోడ్లు, లోతట్టు ప్రాంతాలన్నీ వరద నీటిలో మునిగిపోయి, జనజీవనం స్తంభించి పోయింది. నగరంలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలోకి భారీగా నీళ్ళు, బురద చేరాయి. అన్నిరకాల విమాన సర్వీసులను రద్దు చేయగా, నిలిపి ఉంచిన విమానాలన్నీ నీళ్ళల్లోనే ఉండిపోయాయి. అధికారులందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, అవసరమయిన మందులు, తాగునీరు, ఆహారం ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాగా పశ్చిమ బెంగాల్ లో మరికొన్ని రోజులపాటు భారీ వర్షాలు కురవనున్నట్టు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.