Kuki groups: ఈ నెల 28న మణిపూర్ బంద్..కారణమిదే?
900 మంది కుకీ మిలిటెంట్లు మయన్మార్ నుంచి మణిపూర్లోకి చొరబడ్డారని ఇంటెలిజెన్స్ సమాచారం ఇచ్చిన విషయం తెలిసిందే.
దిశ, నేషనల్ బ్యూరో: 900 మంది కుకీ మిలిటెంట్లు మయన్మార్ నుంచి మణిపూర్లోకి చొరబడ్డారని మైతీ కమ్యూనిటీపై దాడి చేస్తారని ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రకటన అవాస్తవమని కుకీ గ్రూపులు వెల్లడించాయి. నిధారారమైన ఈ ప్రకటనకు నిరసనగా ఈ నెల 28న మణిపూర్లో కుకీలు అధికంగా ఉండే జిల్లాల్లో బంద్కు పిలుపునిచ్చాయి. ఈ మేరకు కుకీ ఇన్పి మణిపూర్ (కేఐఎం), ఇండీజినస్ ట్రైబల్ లీడర్స్ ఫోరమ్ (ఐటీఎల్ఎఫ్) సంస్థలు మంగళవారం సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశాయి. ‘మయన్మార్ నుంచి శిక్షణ పొందిన కుకీ మిలిటెంట్లు చొరబడ్డారని సీఎంఓ కార్యాలయం నుంచి వచ్చిన సమాచారం నిరాధారమైనది. కుకీ ప్రజలను టార్గెట్ చేయడంలో భాగంగానే ఈ ప్రకటన చేశారు’ అని తెలిపాయి. దీనికి నిరసనగా కుకీ జనావాస ప్రాంతాలన్నింటిలో 28న మొత్తం షట్డౌన్ అమలు చేస్తామని పేర్కొన్నాయి. కుకీలందరూ ఇంట్లోనే ఉండాలని ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించాయి. తమ ప్రాంతాల బయట ప్రయాణించొద్దని సరిహద్దులను మూసివేస్తామని ప్రకటించాయి.