Kuki groups: ఈ నెల 28న మణిపూర్ బంద్..కారణమిదే?

900 మంది కుకీ మిలిటెంట్లు మయన్మార్ నుంచి మణిపూర్‌లోకి చొరబడ్డారని ఇంటెలిజెన్స్ సమాచారం ఇచ్చిన విషయం తెలిసిందే.

Update: 2024-09-24 18:15 GMT

దిశ, నేషనల్ బ్యూరో: 900 మంది కుకీ మిలిటెంట్లు మయన్మార్ నుంచి మణిపూర్‌లోకి చొరబడ్డారని మైతీ కమ్యూనిటీపై దాడి చేస్తారని ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రకటన అవాస్తవమని కుకీ గ్రూపులు వెల్లడించాయి. నిధారారమైన ఈ ప్రకటనకు నిరసనగా ఈ నెల 28న మణిపూర్‌లో కుకీలు అధికంగా ఉండే జిల్లాల్లో బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ మేరకు కుకీ ఇన్పి మణిపూర్ (కేఐఎం), ఇండీజినస్ ట్రైబల్ లీడర్స్ ఫోరమ్ (ఐటీఎల్ఎఫ్) సంస్థలు మంగళవారం సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశాయి. ‘మయన్మార్ నుంచి శిక్షణ పొందిన కుకీ మిలిటెంట్లు చొరబడ్డారని సీఎంఓ కార్యాలయం నుంచి వచ్చిన సమాచారం నిరాధారమైనది. కుకీ ప్రజలను టార్గెట్ చేయడంలో భాగంగానే ఈ ప్రకటన చేశారు’ అని తెలిపాయి. దీనికి నిరసనగా కుకీ జనావాస ప్రాంతాలన్నింటిలో 28న మొత్తం షట్‌డౌన్ అమలు చేస్తామని పేర్కొన్నాయి. కుకీలందరూ ఇంట్లోనే ఉండాలని ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించాయి. తమ ప్రాంతాల బయట ప్రయాణించొద్దని సరిహద్దులను మూసివేస్తామని ప్రకటించాయి.  


Similar News