బీఎస్పీ తమిళనాడు చీఫ్ హత్య కేసులో 8 మంది అరెస్టు

బీఎస్పీ తమిళనాడు చీఫ్ ఆర్మ్ స్ట్రాంగ్ హత్య కేసులో 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Update: 2024-07-06 04:33 GMT

దిశ, నేషనల్ బ్యూరో: బీఎస్పీ తమిళనాడు చీఫ్ ఆర్మ్ స్ట్రాంగ్ హత్య కేసులో 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చెన్నై పెరంబూర్‌లోని నివాసం దగ్గర శుక్రవారం రాత్రి ఆరుగురు వ్యక్తులు ఆయనపై కత్తిదాడి చేశారు. స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు. కాగా.. హత్య కేసులో 8 మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. “ఆర్కాట్ సురేష్ అనే గ్యాంగ్‌స్టర్ హత్యతో ఆర్మ్ స్ట్రాంగ్ కు సంబంధం ఉందని అనుమానిస్తున్నాం. ఇది ప్రతీకార హత్య కావచ్చు. దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసు గ్యాంగ్ స్టర్ హత్యతో ముడిపడి ఉన్నట్లు తెలుస్తోంది" అని చెన్నై సీనియర్ పోలీసు అధికారి అస్రా గార్గ్ చెప్పారు. ఫుడ్ డెలివరీ ఏజెంట్లుగా వచ్చి ఆర్మ్ స్ట్రాంగ్ పై దాడిచేసినట్లు కథనాలు రాగా.. పోలీసులు వాటిని ఇంకా ధ్రువీకరించలేదు. ఇకపోతే, ఈ కేసు దర్యాప్తును సెంబియం ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్‌కి ఉన్నతాధికారులు అప్పగించారు.

డీఎంకేపై ప్రతిపక్షాల విమర్శలు

తమిళనాడులోని అధికార డీఎంకేపై ప్రతిపక్షం విరుచుకుపడింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయనడానికి ఈ హత్యే నిదర్శమని అన్నారు. “జాతీయ పార్టీ రాష్ట్ర అధినేత హత్యకు గురైతే ఏం చెప్పగలను. శాంతిభద్రతలు క్షీణించాయి. చట్టానికి, పోలీసులకు ఎవరూ భయపడట్లేదు” అని ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి అన్నారు. ఆర్మ్ స్ట్రాంగ్ హత్యపై బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పందించారు. ఆర్మ్ స్ట్రాంగ్ హత్య చాలా విచారకరమని.. దాన్ని ఖండిస్తున్నానని అన్నారు. దళితుల బలమైన గొంతుకగా పేరు పొందారని పేర్కొన్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని మాయావతి పిలుపునిచ్చారు.



Similar News