Mamata Banerjee: సీబీఐకి బదిలీ అయ్యి 16 రోజులైంది.. మరి న్యాయం ఎక్కడ జరిగింది?

కోల్ కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు.

Update: 2024-08-28 10:02 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కోల్ కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మమతా ప్రసంగిస్తూ.. బీజేపీపై మండిపడ్డారు. ‘విచారణ కోసం కేవలం ఐదు రోజుల సమయం అడిగా. కానీ కేసును సీబీఐకి అప్పగించారు. వారు న్యాయం త్వరగా అందించాలనుకోవట్లేదు. కేసు సీబీఐ దగ్గరికి వెళ్లి 16 రోజులైంది. మరి న్యాయం ఎక్కడ జరిగింది?’ అని ప్రశ్నించారు. త్వరలోనే అసెంబ్లీ సమావేశానికి పిలుపునిచ్చి, రేప్ కేసుల్లో దోషులకు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ బిల్లును ప్రవేశపెడతామన్నారు.

బిల్లు ప్రవేశపెడతాం

‘లైంగిక దాడుల వ్యతిరేక చట్టాలకు సంబంధించి బిల్లుల్ని త్వరగా ఆమోదిస్తాం. వాటి ద్వారా నేరం జరిగిన వారం రోజుల్లోనే దోషికి మరణశిక్షపడేలా చూస్తాం. బిల్లును గవర్నర్‌ ఆమోదం కోసం పంపుతాం. దానికి ఆమోదం లభించకపోతే.. రాజ్‌భవన్‌ బయట నిరసన తెలుపుతాం. అలాంటి బిల్లుకు తప్పక ఆమోదం లభించాలి’’ అని మమత అన్నారు. కోల్ కతా హత్యాచార కేసులో బీజేపీ కుట్రపూరిత రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. బెంగాల్ రాష్ట్ర పరువుకు భంగం కల్గించేలా చూస్తుందని మండిపడ్డారు.


Similar News