అసెంబ్లీ ఎదుటకు ‘అర్బన్ నక్సలిజం’ బిల్లు

దిశ, నేషనల్ బ్యూరో : 'అర్బన్ నక్సలిజం'ను అరికట్టేందుకు ‘‘మహారాష్ట్ర ప్రత్యేక ప్రజా భద్రతా బిల్లు- 2024’’ను మహారాష్ట్ర ప్రభుత్వం గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.

Update: 2024-07-11 12:33 GMT

దిశ, నేషనల్ బ్యూరో : 'అర్బన్ నక్సలిజం'ను అరికట్టేందుకు ‘‘మహారాష్ట్ర ప్రత్యేక ప్రజా భద్రతా బిల్లు- 2024’’ను మహారాష్ట్ర ప్రభుత్వం గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. వ్యక్తులు, 48 నిషేధిత సంస్థల చట్టవిరుద్ధ కార్యకలాపాలను నిరోధించేందుకు సంబంధించిన ప్రతిపాదనలు ఈ బిల్లులో ఉన్నాయి. ఇప్పటికే ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు ఆమోదించిన ప్రజా భద్రతా చట్టం తరహాలో ఈ బిల్లును రూపొందించారు. దీన్ని మహారాష్ట్ర మంత్రి ఉదయ్ సమంత్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.మావోయిస్టుల ముప్పును ఎదుర్కోవడానికి ప్రస్తుత చట్టాలు సరిపోవు కాబట్టే.. మావోయిజానికి సహకరించే సంస్థలు, వ్యక్తుల కార్యకలాపాలను అడ్డుకునేందుకు కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

మహారాష్ట్రలోని చాలా నగరాల్లో మావోయిస్టులకు సురక్షిత స్థావరాలు ఉన్నాయని దర్యాప్తుల్లో గుర్తించామని సమంత్ తెలిపారు. మావోయిస్టులను ప్రోత్సహించే ఏ సంస్థను కూడా ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. నిషేధానికి గురయ్యే సంస్థల కార్యకలాపాలలో పాల్గొనే లేదా సహకరించే వారికి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ.3 లక్షల వరకు జరిమానా విధించాలని బిల్లులో ప్రతిపాదించారు. మావోయిస్టులకు సహకారం అందించే ప్రణాళికలు రచించే వారికి, ఆ ప్రణాళికల అమలులో భాగమయ్యే వారికి ఏడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.5 లక్షల వరకు జరిమానా విధించాలని ఈ బిల్లులో ప్రపోజ్ చేశారు.


Similar News