మోడీ-బైడెన్ ‘చీర్స్’.. ప్రధాని మందు కొట్టారా..?

ప్రధాని మోడీ గౌరవార్ధం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విందు ఇచ్చారు.

Update: 2023-06-23 15:22 GMT

వాషింగ్టన్: ప్రధాని మోడీ గౌరవార్ధం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విందు ఇచ్చారు. వైట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన ఈ స్పెషల్ డిన్నర్‌లో మోడీ, బైడెన్ చీర్స్ కొట్టారు. అంటే.. మందు కొట్టారా..? అని అనుమానం కలుగుతోందా..! మోడీ మద్యం సేవించరు. బైడెన్ కూడా తాను మద్యం సేవించనని చెప్పారు. మోడీ మాంసాహారం కూడా ముట్టుకోరు. దీంతో ఈ విందులో మిల్లెట్ కేక్, వాటర్ మెలన్, అవకాడో సాస్, స్ట్రాబెర్రీ కేక్.. ఇలా పెద్ద లిస్టే అందించారు. ఈ వంటకాలను అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ దగ్గరుండి మరీ చీఫ్ చెఫ్ నీనా కర్టెస్‌తో తయారు చేయించారు. ప్రతి టేబుల్‌ను భారత త్రివర్ణ పతాకం రంగులో అలంకరించారు.

ఈ అధికారిక విందులో గ్రామీ అవార్డు గ్రహీత జోషువా బెల్, దక్షిణాసియా మ్యూజిక్ గ్రూప్ పెన్ మాసలాల సంగీతం అందించారు. ఈ విందులో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదేళ్ల, యాపిల్ సీఈవో టిమ్ కుక్, పారిశ్రామికవేత్తలు ఆనంద్ మహీంద్ర, అడోబ్ సీఈవో శాంతను నారాయణ, పెప్సికో మాజీ సీఈవో ఇంద్రానూయి, జీరోధ సీఈవో నికిల్ కామత్, నెట్ ఫ్లిక్స్ చీఫ్ కంటెంట్ ఆఫీసర్ బజారియా తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఇంతకూ మోడీ, బైడెన్ చీర్స్ ఎందుకు కొట్టారో తెలుసా.. అల్లం కషాయం తాగుతూ చీర్స్ కొట్టారు. రెండు పవర్ ఫుల్ దేశాలకు చీర్స్ అని బైడెన్ అన్నారు.


Similar News